శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. షోపియాన్ జిల్లాలోని బాబాపొరా ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ వ్యక్తి కాల్పులకు దెగబడ్డాడు. దీంతో సాధారణ పౌరుడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఇప్పటివరకు కశ్మీర్ లోయలో 11 మంది మరణించారు. ఇందులో బీహార్కు చెందిన ఐదుగురు కూలీలు, మరో ఇద్దరు టీచర్లు ఉన్నారు.
కశ్మీర్లో ఉగ్రవాదులను భద్రతా బలగాలు అణచివేస్తుండటంతో సాధరణ పౌరులే లక్ష్యంగా టెర్రరిస్టులు కాల్పులకు తెగబడుతున్నారు. తాజా ఘటన కూడా ఉగ్రవాదుల పనేనని పోలీసులు భావిస్తున్నారు. కాల్పులకు పాల్పడినవారికోసం స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్న నేపథ్యలో ఈ కాల్పులు జరగడం విశేషం.
కాగా, పూంచ్ జిల్లా మెంధార్ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, జవాను గాయపడ్డారు. మెంధార్ వద్ద ఉగ్రవాదుల స్థావరం కోసం గాలిస్తుండగా టెర్రిరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. టెర్రరిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.