పటాన్చెరు, జూన్ 4 : ఎరుక కులస్తుల కోసం పటాన్చెరులో స్థలం కేటాయించి షెడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెషన్ హాల్లో ఎరుకల సంఘం సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు పరిధిలో పందుల పెంపకం దారులు పందులను విచ్చలవిడిగా రోడ్లపై వదిలేయవద్దన్నారు. ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసి అందులో పందులను పెంచుకోవాలని సూచించారు. ఇందుకోసం పటాన్చెరులో స్థలాన్ని కేటాయిస్తామన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి పందుల పెంపకందారులకు ప్రత్యేక నిధులు అందేలా చూస్తామన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఎరుకల సంఘం వాళ్లంతా పందుల పెంపకం విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ అంటు వ్యాధులు ప్రబలకుండా పందుల పెంపకందారులకు అందరికీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సహకారంతో ప్రత్యేక స్థలాలు కేటాయిస్తామని చెప్పడం అభినందనీయమన్నారు. వారి జీవనోపాధి కోసం ప్రభుత్వం నుంచి లోన్లు వచ్చే విధంగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో పటాన్చెరు జడ్పీటీసీలు సుధాకర్రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, నాయకులు దశరథరెడ్డి, ఎరుకల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు, సంగారెడ్డి నాయకులు రాము, ఎల్లయ్య, బీహెచ్ఈఎల్ ఇంజినీర్ శంకరయ్య, జిల్లా అధక్షుడు గోపాల్, పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షుడు యాదయ్య, అమీన్పూర్ అధ్యక్షుడు తమ్మయ్య, పటాన్చెరు జనరల్ సెక్రటరీ రాజు పాల్గొన్నారు.
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సినేషన్..
భారతీనగర్ డివిజన్లోని ఎల్ఐజీ సొసైటీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం సూపర్ స్ప్రెడర్స్ కోసం వ్యాక్సినేషన్ డ్రైవ్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్కి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై డివిజన్ కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరోనా కట్టడి కోసం సూపర్ స్ప్రెడర్స్కు విడతలుగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్పానగేశ్, ఉపకమిషనర్ బాలయ్య, ఏఎంవోహెచ్ డాక్టర్ రంజిత్సింగ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, దేవేంద్రచారి, పరమేశ్యాదవ్, ప్రమోద్గౌడ్, నర్సింహ, విఠల్ తదితరులు ఉన్నారు.