ఇబ్రహీంపట్నం, మార్చి 23 : రంగారెడ్డిజిల్లాలోని ఇబ్రహీంపట్నం ఏరోస్పేస్ హబ్గా రూపాంతరం చెందుతున్నది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం పరిధిలోని ఆదిబట్ల మున్సిపాలిటీలో రెండు ఏరోస్పేస్ సంస్థలు ఏర్పాటయ్యాయి. త్వరలోనే ఎలిమినేడు గ్రామంలో మరొకటి ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరిన్ని సంస్థలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఎలిమినేడులో 657ఎకరాల్లో ఆదిబట్లలో ఉన్న ఏరోస్పేస్ సంస్థకు దీటుగా ఈ సంస్థను ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారు. ఎలిమినేడు ఏరోస్పేస్ పనులు మరింత వేగం పుంజుకున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిబట్ల మున్సిపాలిటీలో టాటా అడ్వాన్స్డ్ సిస్టంలో హెలికాప్టర్ క్యాబిన్ తయారీ చేస్తున్నారు. ఈ సంస్థలో తయారయ్యే హెలికాప్టర్ క్యాబిన్లను రక్షణరంగ సంస్థలతో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఆదిబట్లలో మరో ఏరోస్పేస్ సంస్థ టాటా మార్టిన్లాకిడ్ కూడా ఏర్పాటైంది. ఇందులో హెలికాప్టర్ విడిభాగాల తయారీ కొనసాగుతున్నది. హైదరాబాద్కు అతిసమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరిన్ని ఏరోస్పేస్ సంస్థలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ఇంటర్నేషల్ ఏరోస్పేస్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. జీఎంఆర్, ఎయిర్పోర్టులో ప్రత్యేకంగా ఏరోస్పేస్ పార్కు భూమిని కూడా నోటిఫై చేశారు. దీంతో ఈ ప్రాంతం ఏరోస్పేస్ రంగానికి కేంద్ర బిందువు కానున్నది.
ఎలిమినేడులో మరో భారీ ఏరోస్పేస్ సంస్థ
ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో మరో ఏరోస్పేస్ సంస్థ ఏర్పాటుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎలిమినేడు గ్రామంలో సర్వేనంబర్ 166లో 103ఎకరాలు, 421లో 176.22ఎకరాలు, 512లో 376ఎకరాలు ఈ సంస్థ ఏర్పాటుకోసం గుర్తించారు. 378ఎకరాలు ప్రభుత్వ భూమికాగా, ఈ భూమిని ఇప్పటికే ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకున్నది. అలాగే, మిగతా భూమి పట్టాభూములు కావడంతో భూములు ఇవ్వడానికి రైతులను అంగీకరించే విధంగా పరిహారాన్ని అందిస్తున్నారు. మరోవారం రోజుల్లో రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించనున్నారు.
100 ఎకరాల్లో కాంపోజిట్ పార్కు
ఇబ్రహీంపట్నం సమీపంలో సుమారు 100ఎకరాల్లో కాంపోజిట్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ కూడా పూర్తయింది. ఈ పార్కులో తమ సంస్థలను ఏర్పాటు చేయడం కోసం 40కంపెనీలు ముందుకు వచ్చాయి. దీంతో వారికి ప్రభుత్వం భూములు కూడా కేటాయించింది. హైదరాబాద్కు అతిసమీపంలో ఈ పార్కును ఏర్పాటు చేయడం వలన ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో అనేక రక్షణరంగ సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి. రక్షణరంగంలో అతి కీలకమైన ఎన్ఎస్జీ, ఆక్టోపస్, బీడీఎల్ వంటి సంస్థలు కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పాటు అయ్యాయి.