డెహ్రాడూన్ : కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో కుంభమేళాలో పాల్గొనే భక్తులను ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే అనుమతించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు స్పష్టం చేసింది. కుంభమేళాలో పవిత్ర గంగానదిలో మునక వేసేందుకు ఏప్రిల్ 1 నుంచి హరిద్వార్కు వచ్చే భక్తులకు కొవిడ్-19 నెగెటివ్ రిపోర్ట్ అవసరం లేదని సీఎం తిరత్ సింగ్ రావత్ పేర్కొన్న క్రమంలో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెద్దసంఖ్యలో వెలుగుచూస్తుండటంతో పండుగలు, పర్వదినాల సమయంలో అప్రమత్తగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
కుంభమేళాతో మహమ్మారి కేసులు మరింత పెరగకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్న క్రమంలో అత్యున్నత స్ధాయి కేంద్ర బృందం కుంభమేళాతో వైరస్ కేసులు పెరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేపట్టిన వైద్య, ప్రజారోగ్య ఏర్పాట్లను కేంద్ర బృందం ఇటీవల సమీక్షించింది. కుంభమేళాలో స్నానాలు చేస్తున్న యాత్రికుల్లో రోజుకు 20 మంది వరకూ, స్దానికుల్లో మరో 20 మంది వరకూ ప్రతిరోజూ కరోనా వైరస్ బారినపడుతున్నట్టు కేంద్ర బృందం గుర్తించింది.