తెలుగులో ఆదిగ్రంథమైన మహాభారతంలో ఆదికవియైన నన్నయ ఉదంకోపాఖ్యానంలో ‘అనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్’ అనే మకుటంతో కొన్ని పద్యాలున్నాయి. తరువాతి కాలంలో శతక రచనకు కొన్ని ప్రమాణాలు, పద్ధతులు నియమాలు ఏర్పడిన పిదప ఎందరో ప్రసిద్ధ ప్రబంధ కవులు కూడ శతక రచనలు చేశారు.
ప్రాఙ్నన్నయ యుగంలో చిన్న సెలయేరు కాల్వవలె ఉద్భవించిన మన తెలుగు సాహిత్యం మహానదీ ప్రవాహంలా వివిధ వైవిధ్య ప్రక్రియలతో శాఖోప శాఖలుగా విస్తరించి పద్య, గద్య, చంపూ, నాటక, శతక, నవల, కథ, అనువాదాది రూపాలతో నిత్యనూతనత్వాన్ని పొందుతున్నది.
భక్తి జ్ఙాన వైరాగ్యసిద్ధికి, సమాజాభివృద్ధికి, నైతిక జీవనానికి కవితా పాటవ నైపుణ్యానికి శతక రచన కవులకు బజ్జబంతి. మకుట, సంఖ్యా, ఛందో నియమాలున్నప్పటికి నాటి నుంచి నేటి కంప్యూటర్ యుగంలో కూడా ఎందరో కవులు శతక రచనలతో ఈ సాహిత్య ప్రక్రియను సుసంపన్నం చేస్తూనే ఉన్నారు.
శేషప్ప కవి తాను కావ్య, శాస్త్ర, ఛందస్సు చదివిన పండితుడను కానని, భక్తి భావంతో మాత్రమే శతక రచన చేస్తున్నానని, కటిక పేదరికాన్ని, కష్ట సమస్యల నుంచి కడతేర్చుమని, ఆర్ద్రతతో ప్రార్థించాడు.18వ శతాబ్ది పూర్వార్ధంలో రచింపబడిన ‘నరసింహ శతకము’ తెలుగు శతకాలలో అగ్రస్థానంలో ఉంది. దీనిని రచించిన కవి కుకుత్సం శేషప్ప తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో గల పవిత్ర గోదావరి నదీతీరాన గల ధర్మపురి గ్రామ నివాసి.
శతక రచనకు ప్రపంచంలోనే ఆది కావ్యమైన, ఆదికవియైన వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో బీజం పడిందని చెపుతారు. సుందరకాండలో అశోక వనాన్ని ధ్వంసం చేసిన హనుమను ఇంద్రజిత్తు బంధించి రావణ సభలో నిలబెట్టగా వానర జాతికి ప్రియాంగమైన వాలాన్ని (తోకను) కాల్చమని ఆదేశించారు. ఈ విషయం తెలిసిన సీతమ్మ దుఃఖించి హనుమకు ఎట్టి ఆపద రాకుండ కాపాడమని అగ్నిదేవుని ప్రార్థిస్తూ ‘శీతోభవ హనూమతః’ అనే మకుటంతో 5,6 శ్లోకాలు వాల్మీకి మహర్షిచే చెప్పబడ్డాయి.
తెలుగులో ఆదిగ్రంథమైన మహాభారతంలో ఆదికవియైన నన్నయ ఉదంకోపాఖ్యానంలో ‘అనంతుడు మాకు ప్రసన్నుడయ్యెడున్’ అనే మకుటంతో కొన్ని పద్యాలున్నాయి. తరువాతి కాలంలో శతక రచనకు కొన్ని ప్రమాణాలు, పద్ధతులు నియమాలు ఏర్పడిన పిదప ఎందరో ప్రసిద్ధ ప్రబంధ కవులు కూడ శతక రచనలు చేశారు. పాల్కురికి సోమన రచించిన ‘బసవా, బసవా, బసవావృషాధిపా’ అనే మకుటంతో గల వృషాధిప శతకం తెలుగులో సమగ్ర లక్షణ ప్రథమ శతకమని విమర్శకులు పేర్కొన్నారు. తెలుగు భాషలో ఇంతవరకు ఐదువేల పైచిలుకు శతకాలు రచింపబడ్డాయి. దాశరథి, నరసింహ, కృష్ణ, వేమన, సుమతీ మొదలగు నీతిబోధక శతకాలే గాక, ప్రసిద్ధ దేవతలందరిపైన శతకాలు రచింపబడ్డాయి. భక్తి, నీతి, వ్యాజస్తుతి, సంఘ సంస్కరణ మొదలగు వస్తు వైవిధ్యంతో బాటు, ఏ పద్యానికాపద్యం ప్రత్యేకత కల్గియుంటుంది.
శ్రీ యోగ లక్ష్మీనరసింహస్వామి స్థానిక దైవంగా పుణ్య తీర్థక్షేత్రంగా ధర్మపురి విరాజిల్లుతున్నది. స్థానిక చరిత్రాంశాలను బట్టి శేషప్ప చాదాత్త వైష్ణవుడని యాయవారం (భిక్షాటన) చేసికొని జీవించేవాడని, అకుంఠిత స్వామిభక్తుడని ‘నరసింహ, నరహరి, నృకేసరి’ అనే మూడు శతకాలతో బాటు ‘ధర్మపురి రామాయణం’ అనే యక్షగానాన్ని రచించినాడని సాహితీవేత్తలు చెప్పారు.
ఈ శతకాన్ని ప్రథమంగా తెలుగు భాషోద్ధారకులు, పరిశోధకులైన సి.పి. బ్రౌన్ ముద్రించి ప్రచారంలో తెచ్చినారని ప్రసిద్ధకవి, పరిశోధకులైన ఆరుద్ర తమ సమగ్ర ఆంధ్ర సాహిత్యం (స.ఆం.సా.) సంపుటంలో పేర్కొన్నారు. కవుల చరిత్రలు రాసిన ప్రసిద్ధ రచయితలు శతకాలపై పరిశోధనలు, సమీక్షలు చేసిన నిడుదవోలు వెంకటరావు, గోపాలకృష్ణ మొదలగువారు దీనిని ఉత్తమ శతకంగా ప్రస్తుతించిరి.
ఎన్నో సాహితీ పరిషత్తులు, స్థానిక దేవస్థాన కమిటీ వారు ముద్రించిన నాటినుంచి నేటి వరకు ఈ శతకం శతాధిక ముద్రణలు పొందుటయే దీని ప్రశస్తికి తార్కాణం. ఇటీవల నరసింహ, నరహరి, నృకేసరి మూడింటిని కలిపి సాహితీ ప్రియుడు, ధర్మపురి వాసుడైన శ్రీ ధర్మ మధ్వాచారి రాంకిషన్పునః ముద్రించారు. 25 ఏండ్ల పూర్వం వరదాచారి అను పండిత కవి ఈ శతకాన్ని సంస్కృత శ్లోకాలుగా అనువదించారు.
శేషప్ప కవి తాను కావ్య, శాస్త్ర, ఛందస్సు చదివిన పండితుడను కానని, భక్తి భావంతో మాత్రమే శతక రచన చేస్తున్నానని, కటిక పేదరికాన్ని, కష్ట సమస్యల నుంచి కడతేర్చుమని, ఆర్ద్రతతో ప్రార్థించాడు. కోపంతో కొన్నిచోట్ల నిందాస్తుతి చేశాడు. ఆ కాలంలోని దుశ్శీలుల నైజాన్ని, అగ్రకుల జాత్యహంకారాన్ని నిరసించాడు. శ్రీకారంతో ‘శ్రీ మనోహర సురార్చిత’ అనే పద్యంతో స్వామిని వర్ణిస్తూ పఠితలకు స్వామి రూపాన్ని నేత్ర సాక్షాత్కరం చేశాడు. ‘భూషణ వికాస శ్రీధర్మ పురనివాస-దుష్ట సంహార నరసింహ దురితదూర’ అనే మకుటం తో 108 సీస పద్యాలు చెప్పాడు. స్నాన, దాన, తప, జపానుష్ఠానాదుల కన్న నిర్మల భక్తియే ముక్తి దాయకమని చెప్పాడు. అనితర అద్భుత అసాధ్య కార్యాలు చేయవచ్చుగాని, దుష్టుల స్వభావాన్ని మార్చలేమన్నాడు. తాను కూడా ఎన్నో పాపాలు, దుష్కార్యాలు చేశానని మన్నింపుమని పశ్చాత్తాపంతో వేడుకొన్నాడు. తన పూర్వ, సమకాలీనులైన పోతన, రామదాసు, పురుషోత్తమ కవి మొదలగువారి కవిత్వ భావాలను అనుసరించాడు. మనోహరమైన ఉపమానాలు, సామెతలు, నుడికారాలు స్థానిక వ్యవహార పలుకుబడులతో, భావనా సంపదతో, తేట తెలుగు పదాలతో ద్రాక్షాపాకంలో రచింపబడిన ఈ శతకంలోని పద్యాలు పరిచయంలేని తెలుగు వారుండరు అనుటలో అతిశయోక్తి లేదు. వీధిబడులలో బాలుర చేత బట్టీ పట్టించేవారు. పాఠ్య పుస్తకాలలో కూడా చేర్చబడ్డాయి. నేటికి కూడ మహిళలు, వృద్ధులు స్వామిని దర్శించుకొని ప్రదక్షిణాలు చేస్తూ శతక పారాయణం చేస్తారు. కన్యాశుల్కం నాటకంలో పోశెట్టి పేకాటలో ముక్కలు ఎత్తినప్పుడు ‘నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత’ అనే పద్యాన్ని మాటి మాటికి చదవడం మనం గమనించవచ్చు. తెలుగు దేశమంతా నరసింహ శతకం బహుళ వ్యాప్తి చెందింది. ఈ మధ్య ప్రసిద్ధ సినీ గాయకులు స్వర్గీయ ఎస్పీ బాలుగారు నరసింహ శతకాన్ని వివిధ రాగాలతో, భక్తి భావ యుక్తంగా గానం చేసిన సీడీని విడుదల చేయటం సాహితీ సంగీత ప్రియులకు, భక్తులకు ముదావహం. నరసింహ శతకం వలన ధర్మపురి పుణ్యక్షేత్రానికి సాహిత్య, సమాజంలో విశిష్ట గుర్తింపు వచ్చిందని ఘంటాపథంగా చెప్పవచ్చు.
-సంగనభట్ల శ్యామసుందర్
9908085801