ముట్టుకుంటే అంటుకునే మహమ్మారి కరోనా వైరస్. కొవిడ్ బాధితులను దగ్గరి వాళ్లు సైతం దూరం పెడుతున్న పరిస్థితుల్లో వారికి సేవలు అందిస్తున్న వైద్య, పారిశుధ్య సిబ్బంది గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. కరోనా వైరస్ వెలుగుచూసిన తొలినాళ్లలో ఏర్పాటైన క్వారంటైన్ కేంద్రాల్లో స్కావెంజర్గా సుమారు 26రోజుల పాటు సేవలందించాడు సూర్యాపేట పట్టణానికి చెందిన బాల్మీకి సంజయ్. నేటికీ పారిశుధ్య విధుల్లో ఆనందంగా పాల్పంచుకుంటూ ఓ స్వచ్ఛంద సంస్థ నుంచి ‘రియల్ హీరో’ అవార్డు అందుకున్నాడు.
బొడ్రాయి బజార్, ఏప్రిల్ 28:క్వారంటైన్ కేంద్రాల్లో పనిచేసే వైద్య సిబ్బందితో పాటు పారిశుధ్య కార్మికులు ప్రాణాంతక వైరస్ ప్రబలకుండా నిత్యం పోరాడుతున్నారు. ఎంతో మంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన బాల్మీకి సంజయ్ అనే స్కావెంజర్ జనరల్ దవాఖానలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో సేవలు అందిస్తున్నాడు. సుమారు 4650మంది బాధితులకు సేవలందించిన ఘనత సంజయ్దే. నాడు క్వారంటైన్ కేంద్రాల్లో 26రోజులు పనిచేయడంతో పాటు నేడు జనరల్ దవాఖానలోని గదులను, వస్తువులను శుభ్రం చేస్తూ బాధితుల్లో ధైర్యాన్ని కల్పిస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలతో పాటు ఏరియా దవాఖానల్లోనూ సఫాయీ కర్మచారీలు సేవలందిస్తున్నారు. సంజయ్ సామాజిక సేవల్లోనూ ముందుండడంపై అతడికి సత్యం మానవ సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థ రియల్ హీరో అవార్డును ప్రదానం చేసింది.
బాధితులు క్షేమంగా వెళ్లాలని కోరుకుంటాను..
క్వారంటైన్ కేంద్రంలో 26రోజులు పనిచేశాను. మళ్లీ ఇప్పుడు జిల్లా జనరల్ దవాఖానలో సేవలు అందిస్తున్నాను. కరోనా బాధితులు క్షేమంగా ఇంటికి వెళ్లాలని వారికి భరోసా కల్పిస్తుంటాను. ప్రతి ఒక్కరూ మాస్కు పెట్టుకోవడంతో పాటు భౌతికదూరం పాటిస్తే దవాఖానకు వెళ్లాల్సిన అవసరమే రాదు.