చండీఘడ్ : దేశ రాజధాని ప్రాంతంలో కరోనా వైరస్ కేసుల వ్యాప్తితో రైతుల ఆందోళన సూపర్ స్ప్రెడర్ ఈవెంట్గా మారుతుందని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానా సరిహద్దుల్లో నిరసనలు చేపట్టిన రైతుల ఆరోగ్యం పట్ల తాను కలత చెందుతున్నానని అన్నారు.
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో హర్యానా సరిహద్దుల్లో నిరసన కొనసాగిస్తున్న రైతులను కొవిడ్ నుంచి కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఇక వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు తాను లేఖ రాస్తానని అనిల్ విజ్ పేర్కొన్నారు. సంప్రదింపుల ద్వారానే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని తాను విశ్వసిస్తానని చెప్పారు.