ముంబై: మహారాష్ట్ర హోంమంత్రిగా అనిల్ దేశ్ముఖ్ కొనసాగుతారని, ఆయనను మార్చే ప్రసక్తే లేదని ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ స్పష్టం చేశారు. ముంబై పోలీస్ మాజీ చీఫ్ పరమ్ బీర్ సింగ్ హోంమంత్రిపై చేసిన ఆరోపణలు నేపథ్యంలో దేశ్ముఖ్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి, హోంమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ఆయన లేఖ రాశాడని, హోంమంత్రిని మార్చే ప్రశ్నే లేదని జయంత్ పాటిల్ తేల్చి చెప్పారు. హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు పరమ్ బీర్ సింగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. నెలకు రూ.100 కోట్ల వరకూ వసూళ్లు చేయాలని పోలీసు అధికారులకు హోంమంత్రి లక్ష్యంగా పెట్టారంటూ ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ఖండించిన దేశ్ముఖ్.. పరమ్బీర్పై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.