హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): గ్రామీణ పేదరికం, పట్టణ సంపన్నత మధ్య ఉండే అంతరాలకు అద్దంపట్టే ఆరోగ్య సమస్య ఇది. ప్రాణాధారమైన రక్తంలోని ఎగుడుదిగుడులు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయన్నది తెలిసిందే. అయితే ఈ సమస్యలు అందరిలోనూ ఒకే తీరుగా లేవని హైదరాబాద్లోని జాతీయ పోషకాహార పరిశోధన సంస్థ (ఎన్ఐఎన్) దేశవ్యాప్తంగా జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో గ్రామీ ణ, పేద, కౌమారదశ పిల్లల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నది. కానీ వీరిలో ఐరన్ లోపం లేదు. ఇదే సమయంలో పట్టణ, ధనిక పిల్లల్లో రక్తహీనత సమస్య లేకపోయినా ఐరన్ సమస్య తీవ్రంగా ఉన్నది. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో నిర్వహించిన సర్వేల నుంచి ఎన్ఐఎన్ ఈ సంగతి రాబట్టింది. ఇప్పటికే పలు జాతీయ సర్వేలు దేశం లో 40% నుంచి 50% మంది మహిళలు, పిల్లల్లో రక్తహీనత ఉన్నదని చెప్తున్న నేపథ్యంలో ఈ సమస్యకు సరైన పరిష్కార మార్గాలు కనుగొనాలని ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. నాణ్యమైన ఆహారం, అంటువ్యాధులు, సామాజిక, ఆర్థిక అంశాలపై దృష్టిసారిస్తే సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా తీవ్ర ఐరన్లోపం రక్తహీనతకు దారితీస్తుందనుకుంటారు. అయితే రక్తంలో ఐరన్ శాతాన్ని తెలుసుకునేందుకు నిర్వహించే (బయోమార్కర్స్) పరీక్షలకు చాలా ఖర్చవుతుంది. అందుకే రక్తంలో హిమోగ్లోబిన్ ఎంత ఉన్నదో పరీక్షించి దాని ఆధారంగా ఐరన్ శాతాన్ని అంచనా వేస్తుంటారు. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఐరన్ మాత్రలు, ఐరన్ ఉన్న ఆహారాన్ని ఇస్తుంటారు. కానీ దేశంలో రక్తహీనత సమస్యకు ఇది సరైన పరిష్కారం కాదని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత తెలిపారు.
33 వేల మందిపై పరిశోధన
దేశవ్యాప్తంగా 2016-18లో నేషనల్ న్యూట్రిషన్ సర్వేలో భాగంగా వివిధ రాష్ర్టాల్లో 33 వేల మంది బాల్య, కౌమారదశ పిల్లలపై సర్వే చేశారు. ఆ సర్వేలో భాగంగా సేకరించిన శాంపిల్స్పై ఎన్ఐఎన్ చేసిన అధ్యయనంలో దేశంలో 30% నుంచి 32% ఇంకా బడికి వెళ్లడం మొదలుపెట్టని పిల్లలు, కౌమారదశలో ఉన్న పిల్లల్లో ఐరన్ లోపం ఉన్నట్టు తేలింది. 5 నుంచి 9 ఏండ్ల పిల్లల్లో 11% నుంచి 15% ఈ సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ పరిశోధనను లీడ్ చేసిన శాస్త్రవేత్త భారతి కుల్కర్ణీ మాట్లాడుతూ.. ‘రక్తహీనత సమస్య, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవడంలో నాణ్యమైన ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో ఐరన్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఇంకా చాలా పోషకాలు కావాలి. పాలు, గుడ్లు, మాంసం, పండ్ల ను ఎక్కువగా తినాలి. అంటువ్యాధుల బారినపడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పేదలు నాణ్యమైన ఆహారం తీసుకునేలా చర్యలు తీసుకోవాలి’ అన్నారు.
పరిశోధనలో పాల్గొన్న పిల్లల వివరాలు
వయసు పిల్లల సంఖ్య
1 నుంచి 4 9,635
5 నుంచి 9 11,938
10 నుంచి 19 11,506
ఐరన్ ఎక్కువగా ఉన్న పిల్లలు
పట్టణ ప్రాంతాల్లో 41%
గ్రామీణ ప్రాంతాల్లో 29%
ధనికుల్లో 44%
పేదల్లో 22%