పారిస్ : 2016లో భారత్, ఫ్రాన్స్ మధ్య రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే ఓ భారత దళారీకి రఫేల్ జెట్స్ తయారీ కంపెనీ దసాల్ట్ మిలియన్ యూరోలు బహుమతిగా చెల్లించిందని ఫ్రెంచ్ ప్రచురణ సంస్థ మీడియాపార్ట్ వెల్లడించింది. దసాల్ట్ గ్రూప్ 2017 ఖాతాల్లో క్లయింట్లకు బహుమతుల పద్దు కింద 5,08,925 యూరోలు చెల్లించినట్టు నమోదైందని తెలిపింది. దసాల్ట్ ఖాతాల ఆడిటింగ్లో భాగంగా ఈ అవకతవకలను తొలుత ఫ్రెంచ్ అవినీతి నిరోధక సంస్థ (ఏఎఫ్ఏ) గుర్తించింది.
రఫేల్ జెట్స్ భారీ నమూనాలను తయారుచేసినందుకు ఈ సొమ్మును చెల్లించామని కంపెనీ పేర్కొన్నా ఈ నమూనాలు తయారయ్యాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఏఎఫ్ఏ పేర్కొందని ఆడిట్ నివేదికను ప్రస్తావిస్తూ మీడియాపార్ట్ తెలిపింది. తమ ఖాతాల్లో ఈ ఖర్చును క్లైంట్లకు బహుమతులనే పద్దులో ఎందుకు చూపారనే ప్రశ్నలపైనా దసాల్ట్ సరైన వివరణ ఇవ్వలేదని పేర్కొంది. ఇక ఈ ముడుపుల వ్యవహారం న్యాయ, రాజకీయ వర్గాల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తాయని పేర్కొంది.