ముంబై, అక్టోబర్ 21: డ్రగ్స్ కేసులో నటి అనన్య పాండే గురువారం సాయంత్రం ఎన్సీబీ ముందు హాజరయ్యారు. ఆమె స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. అంతకు ముందు ఎన్సీబీ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆమె ల్యాప్టాప్, ఫోన్ను స్వాధీనం చేసుకొన్నారు. షారూక్ కొడుకు ఆర్యన్తో ఆమె వాట్సాప్ ద్వారా చాట్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడి కావడంతో ఆమె ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. షారూక్ ఖాన్ ఇంటికి కూడా ఎన్సీబీ అధికారులు వెళ్లారు. అయితే, దర్యాప్తునకు సంబంధించిన మెటీరియల్ కోసమే వచ్చామని, రైడ్ చేయలేదని తెలిపారు. మరోవైపు, షారూక్ ఖాన్ దాదాపు మూడు వారాల తర్వాత తనయుడు ఆర్యన్ ఖాన్ను గురువారం కలుసుకొన్నారు. డ్రగ్స్ కేసులో ఈ నెల 3న అరెస్టు అయిన అర్యన్ ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు. ఉదయం 9 గంటల సమయంలో షారూక్ జైలుకు వచ్చారు. కాగా, ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్పై బాంబే హైకోర్టు ఈ నెల 26న విచారణ జరుపనున్నది.