నేడు మదర్స్డే
అమ్మలుగా ఆప్యాయత పంచుతూ, ప్రజాప్రతినిధులుగా పాలన చక్కబెడుతున్న వైనం
అధికారుల్లోనూ అనేకమంది ..
అమ్మ గురించి,అమ్మ గొప్పదనం గురించి చెప్పుకునేందుకు మరో సందర్భం మాతృ దినోత్సవం.. తల్లి,తండ్రి, గురువు, దైవం.. అని అందరిలోనూ అమ్మకే ప్రథమ ప్రాధాన్యం… మే రెండో ఆదివారం మదర్స్ డేగా జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లాలో అనేకమంది అమ్మలుగా తమ పిల్లలను ఉన్నత శిఖరాలకు ఎదిగేలా తీర్చిదిద్దుతూ… ప్రజా ప్రతినిధులుగా, అధికారులుగా రాణిస్తున్నారు. ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉన్న సబితారెడ్డి నుంచి జెడ్పీ చైర్పర్సన్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు.. వీరితో పాటు జిలా స్థాయి అధికారులు అనేకమంది… ఇటు అమ్మగా ఆప్యాయత పంచుతూ, అటు ప్రజాప్రతినిధులు, అధికారులుగా పాలన వ్యవహారాలు చక్కపెడుతున్నారు. అయినా అమ్మను గౌరవించడం కోసం, అమ్మ గొప్పదనం చెప్పుకోవడం కోసం పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా మదర్స్డే వచ్చింది… కానీ.. ప్రతిరోజు అమ్మదే.. అమ్మ ప్రస్తావన లేని, అమ్మను తలచుకొని రోజంటూ ఉంటుందా..!
-ఇబ్రహీంపట్నం, మే 8
కనిపించే దైవం అమ్మ… అందుకే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు పెద్దలు… పిల్లలు అందంగా ఉన్నా, వికారంగా ఉన్నా, అంగవైకల్యం కలిగి ఉన్నా గుండెలకు హత్తుకుంటుంది తల్లి… తన సంతానాన్ని కండ్లల్లో పెట్టుకొని చూసుకుంటుంది అమ్మ… అందుకే… ఏనుగంతటి తండ్రి ఉన్నా అమ్మలేని జీవితం అంధకారమే అంటారు పెద్దలు…. అమ్మ చేతి ముద్ద అమృతంగా ఉంటదంటారు.. ఎందుకంటే ప్రేమ, అప్యాయత రంగరించి గోరు ముద్దలు తినిపిస్తుంది కాబట్టి… అందుకే అమ్మ అంటే అందరికీ అనురాగం, ఆప్యాయత. ఆదివారం మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనం
ఇబ్రహీంపట్నం, మే 8 : మదర్స్ డేను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ తేదీల్లో నిర్వహించుకుంటున్నారు. ఎక్కువగా మార్చి, మే నెలల్లో నిర్వహించుకుంటున్నారు. మనదేశంలో మాత్రం మే నెల రెండో ఆదివారం జరుపుకుంటున్నాం. ఈ తేదీని ప్రపంచంలో 40కి పైగా దేశాలు అనుసరిస్తున్నాయి. ఈ వేడుకలో కుటుంబ సభ్యులంతా ప్రత్యేకంగా అమ్మకు ప్రత్యేక అభినందనలు తెలుపుకునే సందర్భం. ఇలా నిర్వహించుకునే పండుగలు.. ‘ఫాదర్స్ డే, సిబ్లింగ్స్ డే, చిల్డ్రన్స్ డే, పేరెంట్స్ డే, గ్రాండ్ పేరెంట్స్ డే’ మొదలైనవి ఎన్నో ఉన్నాయి. మన పెద్దలు ‘మాతృ దేవోభవ.. పితృ దేవోభవ’ అంటూ అమ్మకే అగ్ర తాంబూలం ఇచ్చారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా.. ఏ ప్రాంతంలోనైనా సంస్కృతులు, ఆచార వ్యవహారాలు మారుతాయేమో కానీ, అమ్మ ప్రేమ మారదు.
పదాలు తెలియని పెదాలకు అమృత వాక్యం అమ్మే. ఆమె చల్లని ఒడిలోనే మొదలవుతుంది ఎవరి ఎదుగుదలైనా. ఆకాశమంత విశాలమైన మనస్సుతో.. ఓర్పు మమకారంతో అజరామరం, అనన్యమైన ప్రేమతో.. త్యాగానికి ప్రతిరూపంగా నిలిచే తల్లి గొప్పతనాన్ని వర్ణించడం అనితర సాధ్యం. నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి, జన్మనిస్తుంది. బిడ్డ చేసే అల్లరిని చూసి మురిసిపోతుంది. పిల్లలు చేసే తప్పులను సరిచేస్తూ… ఏది తప్పు, ఏది ఒప్పో చెబుతుంది. అడగనిదే అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. కానీ, అది అబద్దం. పిల్లల మనస్తత్వం సరిగ్గా అంచనా వేయడంలో అమ్మ తర్వాతే ఎవరైనా. వారికి ఏ సమయంలో ఏం కావాలి. ఏం ఇవ్వాలనే విషయం తల్లికి మాత్రమే తెలుస్తుంది. తన కుటుంబం కోసం రేయనక, పగలనక శ్రమిస్తుంది. ప్రేమ పంచి.. పెంచి.. లాలించి.. బుజ్జగించి.. అభిమానాన్ని గోరుముద్దగా పెట్టే అమ్మకు ఆ బ్రహ్మ కూడా దాసోహమే. స్వార్థం అంటే తెలియక గుప్పెడు గుండెలో ఆకాశమంత ప్రేమను మాత్రమే దాచేది అమ్మ మాత్రమే.
అమ్మ.. కడుపులో ఉన్నప్పుడు తంతే.. పులకరిస్తుంది. భూమ్మీదికొస్తూనే నొప్పులు పెట్టినా భరిస్తుంది. చనుపాల కోసమో జోల పాట కోసమో అంతులేని శ్రమను నిద్రలేని రాత్రులను మిగిల్చినా అది మధుర జ్ఞాపకంగా భావిస్తుంది. పెరిగి పెద్దయ్యాక కోపమో తాపమో ప్రదర్శిస్తే ‘బిడ్డకొచ్చిన కష్టమేమిటో’నని జాలి చూపిస్తుంది. ఎంత ఎదిగితే అంత సంబురపడుతుంది.. పెండ్లి చేసి పిల్లల పిల్లలను చూడాలని తపిస్తుంది. ఆ పిల్లలనూ తన బిడ్డల్లా భావించి వాళ్ల ఆలనాపాలనా చూస్తుంది. కట్టుకున్నవాడి కంటే కన్నవాడినే ఆత్మగా మార్చుకుంటుంది. కన్నబిడ్డల ప్రేమ కోసమే తహతహలాడుతుంది. ఆ ప్రేమను కొలవలేం. వెలకట్టలేం.
అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు..
నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ పైచేయి సాధిస్తున్నారు. మారుతున్న కాలానుగుణంగా మహిళలే పైచేయి సాధిస్తున్నారు. నేడు ఉమ్మడి జిల్లాలో అధిక శాతం మహిళా ప్రజాప్రతినిధులే ప్రజాసేవ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ తీగల అనితారెడ్డితో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని 4 మున్సిపాలిటీల్లో మహిళలే ఛైర్పర్సన్లుగా కొనసాగుతున్నారు. అలాగే, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలుగా కూడా అధిక శాతం మహిళా ప్రజాప్రతినిధులే కొనసాగుతున్నారు.
మహిళలకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం..
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్గా ప్రజా సేవ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇద్దరు ఆడ బిడ్డలకు తల్లిని. అమ్మగా బాధ్యతను నిర్వర్తించడంతో పాటు ప్రజా సేవకు అంకితభావంతో పని చేస్తున్నా. ఎమ్మెల్యే సహకారంతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా.
మాతృత్వం వరం..
మాతృత్వం ఒక వరం. అమ్మతనంతోనే జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళలను గౌరవిస్తూ పెద్దపీట వేస్తున్నది. మహిళగా ప్రజా సేవ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. గృహిణిగా బాధ్యతలను నిర్వర్తించడంతోపాటు ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఎమ్మెల్యే సహకారంతో శంకర్పల్లి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా.