ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర తాజాగా ట్వీట్ చేసిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. మేక పిల్లలు తోకలు ఊపుతూ పాలు తాగుతున్న వీడియోను శనివారం ఆయన షేర్ చేశారు. మేకల సంరక్షకుడు పాల సీసాలను ఒక స్టాండ్లో ఉంచుతాడు. బాగా ఆకలిగా ఉన్న మేక పిల్లలు ఆ పాల సీసాలకు బిగించిన పీకల ద్వారా పాలు తాగుతుంటాయి. ఈ సందర్భంగా తమ పొట్టి తోకలను బాగా ఊపుతుంటాయి. ‘ఇది ఒక అందమైన జంతువుల వీడియో మాత్రమే కాదు. ప్రపంచం కొత్త శక్తిని కనుగొన్నట్లు నేను భావిస్తున్నాను. #టెయిల్పవర్. ఊగే తోకలను టర్బైన్, ప్రీస్టోకు కలిపితే మీకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.. ’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇప్పటికే సుమారు 2 లక్షల మంది దీనిని వీక్షించారు. నెటిజన్లు కూడా ఈ వీడియోను బాగా లైక్ చేశారు. ‘ఖచ్చితంగా ఈ ‘కొత్త శక్తి’ విద్యుత్ ఉత్పత్తిలో వినూత్న సాంకేతిక పరిజ్ఞానంగా నిలుస్తుంది’ అని ఒకరు బదులిచ్చారు. మరి కొందరు ఫన్నీగా కామెంట్ చేశారు.