న్యూఢిల్లీ: ఆనంద్ మహీంద్రా.. ఈ బిజినెస్ టైకూన్ ఎంత ఎత్తుకు ఎదిగినా.. సోషల్ మీడియాలో సాధారణ జనంతో కనెక్ట్ అయ్యే పోస్ట్లు చేస్తుంటారు. ఆయన చేసే ట్వీట్లు ఎంతో ఆలోచన రేకెత్తించే విధంగా, ఎంతో సరదాగా కూడా ఉంటాయి. తాజాగా అలాంటిదే ఓ పోస్ట్ ఆనంద్ మహీంద్రా చేశారు. ఈ చిన్న ట్వీట్తో ఆయన విదేశీ కంపెనీలకు బలమైన సందేశమే ఇచ్చారు. ఈ ట్వీట్ కెలోగ్స్ కంపెనీకి చెందినది. ఆ సంస్థను ట్రోల్ చేస్తూ నెట్లో వైరల్ అవుతున్న పోస్ట్నే తీసుకొని ఆయన తన సొంత కామెంట్ యాడ్ చేశారు.
పదేళ్ల కిందట మన భారతీయుల బ్రేక్ఫాస్ట్ అలవాట్లనే మార్చేస్తానంటూ ఇక్కడి మార్కెట్లో అడుగుపెట్టిన కెలోగ్స్.. ఇప్పుడు చివరికి మన ఉప్మానే అమ్ముకుంటోందన్నది ఆ మీమ్స్ సారాంశం. ఓ స్టోర్లోని కెలోగ్స్ ఉప్మా ప్యాకెట్ల ఫొటోను ఈ మీమ్స్కు వాడుకున్నారు. దీనిని ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేస్తూ.. కెలోగ్స్ ఇక్కడికి వచ్చి పదేళ్లకుపైనే అయింది. ఇది పాతదే అయినా ఇప్పుడీ మీమ్ వైరల్ అవుతోంది. సెంటిమెంటే గెలిచింది. లోకల్ చాంపియన్స్ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు అని కామెంట్ చేశారు.
ఈ ట్వీట్ నెటిజన్లకు తెగ నచ్చేసింది. అంతేకదా మరి.. వేల సంవత్సరాలుగా ఉన్న మా ఆహార అలవాట్లను మీ విదేశీ బ్రేక్ఫాస్ట్లు ఏమీ చేయలేవు అని ఆనంద్ మహీంద్రా ట్వీట్పై నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఆదివారం ఉదయం ఆయన ఈ ట్వీట్ చేయగా.. వేల కొద్దీ లైక్స్, వందల కొద్దీ కామెంట్స్ వచ్చాయి. ఓ నెటిజన్ అయితే భారతీయులు కేవలం ఆహారాన్నే తినరు.. సెంటిమెంట్నే తింటారు అని ఫన్నీగా కామెంట్ చేయడం విశేషం.