న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన రెండు మీడియా సంస్థలపై ఇన్కమ్ టాక్స్ సోదాలు జరుగుతున్నాయి. ప్రఖ్యాత హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్, ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ టెలివిజన్ ఛానెల్ భారత్ సమాచార్పై ఐటీ సోదాలు చేపట్టింది. దైనిక్ భాస్కర్ పత్రికకు చెందిన 35 లొకేషన్లలో సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని దైనిక్ భాస్కర్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఇక భారత్ సమాచార్ టెలివిజన్కు సంబంధించి లక్నోలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా భారత్ సమాచార్ ఛానెల్ ఎడిటర్ నివాసంలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ రెండు మీడియా సంస్థలు ప్రభుత్వానికి పన్నులు ఎగవేసినట్లు కచ్చితమైన సాక్ష్యాలు ఉన్నందువల్లే సోదాలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇటీవల దైనిక భాస్కర్ పత్రిక, భారత్ సమాచార్ టెలివిజన్లో వచ్చిన కథనాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడింది. దాంతో ఆ రెండు పత్రికలు పన్ను ఎగవేసినట్లు గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు సోదాలు చేయిస్తున్నది. అయితే, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో యూపీ ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టినందుకే ప్రభుత్వం ఆ రెండు పత్రికలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.