హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): ఆకలితో ఉన్నోళ్లకు కడుపునిండా అన్నం పెడితే.. చావుబతుకుల మధ్య ఉన్నోళ్లకు ప్రాణవాయువును అందిస్తే.. అంతకుమించిన మానవత్వం ఇంకొకటి ఉండదు. ఆ మానవత్వమే ‘హ్యుమానిటీ ఫస్ట్’ అనే స్వచ్ఛంద సంస్థగా మారింది. ఎంతోమంది ఆకలి తీర్చుతూ, మరెంతోమంది ప్రాణాలను కాపాడుతూ మానవత్వానికి మారోరూపంగా నిలుస్తున్నారు ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు మహమ్మద్ సుజాతుల్లా. రెండు సంఘటనలు ఆయన జీవితంలో ఆకలి, ఆక్సిజన్ ఎంత విలువైనవో తెలియజేశాయి. ఈ రెండు సంఘటనలే 2వేల మందికి ఆక్సిజన్ అందించేలా, రోజుకు వెయ్యిమందికి అన్నం పెట్టేలా చేశాయి. ముషీరాబాద్కు చెందిన సుజాతుల్లా బీఫార్మసీలో ఓ సబ్జెక్ట్లో ఫెయిలయ్యాడు. ఆ సబ్జెక్టు పాసైతే 10 మందికి భోజనం పెడతానని ఆ సందర్భంలో మనసులో అనుకున్నాడు. ఆ భగవంతుడికి మాట ఇచ్చాడు. నిజంగానే సబ్జెక్టు పాసయ్యాడు.
వెంటనే తన పాకెట్ మనీతో 10 మందికి అన్నం ప్యాకెట్లను పంచాడు. ఆ రోజే రోడ్లమీద ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నట్టు గుర్తించాడు. వాళ్లకూ సాయం చేయాలని నిర్ణయించుకొన్నాడు. అల్పాహారంతో ప్రారంభించాడు. అతని సేవాభావానికి కుటుంబసభ్యులు, స్నేహితులు తోడయ్యారు. 2016లో ప్రారంభమయిన సేవ రోజుకు వెయ్యి మంది ఆకలి తీర్చుతూ 1650 రోజులుగా కొనసాగుతూనే ఉన్నది. ఈ సేవకు హ్యూమానిటీ ఫస్ట్గా నామకరణం చేసి స్వచ్ఛంద సంస్థగా తీర్చిదిద్దాడు. రాత్రి సమయంలో 300 మందికి భోజనం ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. ఉదయం నిలోఫర్, కోఠి మెటర్నిటీ, నిమ్స్ దవాఖానల వద్ద అల్పాహారాన్ని అందిస్తున్నారు. రాత్రి సమయాల్లో రోడ్లపై ఉండే వారికి భోజనం ప్యాకెట్లను అందిస్తున్నారు. వీటితో పాటు మరికొంత మందికి వైద్య పరికరాలను అందిస్తు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.
మా అమ్మకు ఆక్సిజన్ సిలిండర్ కావాలంటూ ఫోన్
అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటలకు.. ‘మా అమ్మను కాపాడండి.. మా అమ్మకు అక్సిజన్ సిలిండర్ కావాలి.. ఎక్కడా దొరకటం లేదు.. మీరు సహాయం చేస్తారని విన్నా’ అంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్. ఆ వేదన సుజాతుల్లాను కలిచివేసింది. వెంటనే ఆక్సిజన్ సిలిండర్ను ఏర్పాటు చేయించారు. కరోనా వల్ల ఆక్సిజన్ సిలిండర్ల కొరతపై దృష్టిసారించారు. గుజరాత్, కోల్కతాల నుంచి కొన్ని వందల అక్సిజన్ సిలిండర్లను తెప్పించి అవసరం ఉన్న వారికి అందించారు. సుజాతుల్లా మానవత్వానికి ముగ్ధులైన కొందరు బాసటగా నిలిచారు. ఈ సంస్థకు ఇప్పుడు దేశ, విదేశాల నుంచి తమవంతు సహాయం చేస్తున్నారు. సహాయంలోనే సంతోషం ఉంటున్నదని అంటున్న సుజాతుల్లా.. సేవాకార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తానని పేర్కొన్నారు.