హైదరాబాద్, జనవరి 25: వేల ఏండ్ల క్రితం ఘనీభవించిన ఆ సూక్ష్మజీవులు మళ్లీ జీవకళను సంతరించుకోవడమే కాకుండా సంతానోత్పత్తిని కూడా చేస్తుండడం శాస్త్ర ప్రపంచాన్ని అబ్బురంలో ముంచెత్తింది. బిడెలాయిడ్ రోడిఫెర్స్ అనే ఆ బహుకణ సూక్ష్మజీవులు 24 వేల సంవత్సరాల క్రితం సైబీరియో మంచులో గడ్డకట్టాయి. ఇన్నేండ్లుగా క్రిప్టోబయోసిస్ అనే ప్రక్రియ కారణంగా నిద్రాణ స్థితిలోనే ఉండిపోయాయి. రష్యాలోని సాయిల్ క్రయాలజీ లేబరేటరీకి చెందిన శాస్త్రవేత్తలు వాటిని కనుగొన్నారు. కొన్ని నమూనాలను సేకరించి ప్రయోగశాలలో వాటి జీవనక్రియలను పునరుద్ధరించారు. అవి వేల సంవత్సరాల తర్వాత మేల్కొనడమే కాకుండా పార్థినోజెనెసిస్ ప్రక్రియ ద్వారా ఏకలింగ సంతానోత్పత్తిని కూడా జరపడం గమనించారు. కొన్నిరకాల క్రిమికీటకాలు మంచులో కొన్నేళ్లపాటు ఘనీభవించి మళ్లీ మేల్కొనడం తెలిసిన విషయమే. కానీ ఇంత సుదీర్ఘకాలం తర్వాత మేల్కొని సంతానోత్పత్తి జరపడం విశేషమని, ఈ రికార్డుకు దరిదాపుల్లోకి వచ్చే జీవి మరోటి లేదని అంటున్నారు.