లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆకస్మికంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక దళిత వాడను సందర్శించారు. చీపురు చేత పట్టి ఆ దళిత వాడలో ఆమె ఊడ్చారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్య నాథ్కు కౌంటర్ ఇచ్చారు. చీపురు పట్టడం ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సీఎం యోగికి సూచించారు.
లఖింపూర్ ఖేరీ ఘటనలో బాధిత రైతులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను సీతాపూర్ గెస్ట్హౌస్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా చీపురుతో ఆ గదిని ప్రియాంక గాంధీ శుభ్రం చేశారు. సీఎం యోగి దీనిపై కామెంట్ చేశారు. ‘దీని కోసం మాత్రమే వారు ఫిట్గా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. అందుకే వారి స్థాయిని తగ్గించారు. వ్యతిరేకతను వ్యాప్తి చేయడం తప్ప వీరికి వేరే పని లేదు’ అని అన్నారు.
ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ శుక్రవారం లక్నోలోని దళిత ప్రాంతమైన లవ్ కుష్ నగర్ను సందర్శించారు. స్థానికులతో మాట్లాడిన తర్వాత చీపురు పట్టి అక్కడి మహర్షి వాల్మీకి ఆలయంలో శుభ్రం చేశారు. ‘దేశంలోని కోట్లాది మంది మహిళలు, పారిశుధ్య కార్మికులు శుభ్ర పరిచేందుకు ప్రతి రోజూ చీపురులను ఉపయోగిస్తారు. ఇది వారి సరళత, ఆత్మగౌరవానికి చిహ్నం’ అని అన్నారు.
సీఎం యోగి తన వ్యాఖ్యల ద్వారా తనను మాత్రమే అవమానించలేదని, ఈ పని చేసే కోట్లాది మంది దళిత సోదరులు, సోదరీమణులు, పారిశుధ్య కార్మికులను ఆయన అవమానించారని ప్రియాంక గాంధీ విమర్శించారు. దీంతో వీరితోపాటు కలిసి శుభ్రపరిచేందుకు తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. చీపురును ఉపయోగించడం, శుభ్రపరచడం ఆత్మగౌరవ చర్య అని యోగిజీకి తెలియజేశానంటూ ఘాటుగా స్పందించారు.
సీఎం యోగి దళిత వ్యతిరేకి అని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ‘యుపీ ముఖ్యమంత్రి ఇవాళ కులతత్వ ప్రకటన చేయడం ద్వారా తన దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రదర్శించారు. శనివారం అన్ని జిల్లాల కాంగ్రెస్ కమిటీలు వాల్మీకి దేవాలయాలను శుభ్రపరుస్తాయి. దేశంలోని కోట్లాది మంది దళితులు, మహిళలను అవమానించడాన్ని భారతదేశం సహించదు’ అని కౌంటర్ ఇచ్చారు. దీనికి ముందు వాల్మీకి ఆలయంలో ఆమె ప్రార్థనలు చేశారు.