కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయంపై దీదీని అమూల్ వినూత్న రీతిలో అభినందించింది. బీజేపీతో జరిగిన హోరాహోరీ పోరులో 213 స్ధానాలను గెలుచుకుని దీదీ తన సత్తా చాటారు. నందిగ్రామ్ లో సువేందు అధికారి చేతిలో ఓటమి పాలైనా బెంగాల్ లో అధికార పీఠం దక్కించుకుని హ్యాట్రిక్ సాధించారు.
ఇక దీదీ విజయాన్ని ప్రస్తావిస్తూ అమూల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. తెల్లని కాటన్ చీర ధరించిన మమతా బెనర్జీ కెమెరాను చూస్తూ చేతులు ఊపుతుండగా, ఆమె కుడి వైపున అమూల్ గర్ల్ నిలబడిన ఫోటోపై.. షి దీదీ ఇట్ ఎగైన్ అని రాసి ఉంది. టాపికల్ కింది భాగంలో అమూల్ ఎంజాయ్ తృణమూల్ అని పేర్కొంది. క్రియేటివ్ అడ్వర్టయిజింగ్ కు పెట్టింది పేరైన అమూల్ తాజా టాపికల్ తో పలువురిని ఆకట్టుకుంది.