ఎల్బీనగర్, మే 14: కరోనా బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందలేని పేద ప్రజల కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మరిన్ని ఉచిత హోం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం గడ్డిఅన్నారం డివిజన్లో ఏర్పాటు చేసిన ఉచిత హోం ఐసోలేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే , జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్న వారికి, ఒకే రూం ఉండి ఐసోలేషన్లో ఉండే అవకాశం లేని వారి కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉచిత హోం ఐసోలేషన్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఈ కేంద్రంలో ఉచిత వసతితో పాటుగా భోజనం, మందులు కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఐసోలేషన్ కేంద్రానికి వచ్చిన వారు వ్యాధి నయమయ్యే వరకు ఉండవచ్చన్నారు. గడ్డిఅన్నారంలో ఉన్న ఐసోలేషన్ కేంద్రంలో 100 మందికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా సోకి హోం ఐసోలేషన్లో ఉండలేని పరిస్థితిలో ఉన్న పేదలు, బస్తీవాసులకు జీహెచ్ఎంసీ ఐసోలేషన్ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, ఉప కమిషనర్లు సురేందర్రెడ్డి, హరి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.