న్యూఢిల్లీ : తౌక్టే తుఫాన్ ధాటికి పశ్చిమతీర రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తున్నది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తౌక్టే తుఫాన్ బీభత్సానికి గుజరాత్ చిగురుటాకులా వణికిపోతున్నది. తీరప్రాంతాలు భారీగా కోతకు గురయ్యాయి. మరో 3 గంటల్లో గుజరాత్లోని సురేంద్రనగర్- అమ్రేలీ మధ్య తుఫాన్ తీరం దాటుతుందని భారత వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో పశ్చిమతీరం లోతట్టు ప్రాంతాల్లోని వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 190 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. తుఫాన్ ధాటికి గుజరాత్ తీర ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాల్లోని చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. తీగలు తెగిపోయి సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.