న్యూఢిల్లీ : పారామిలటరీ బలగాలు ఎన్నోసవాళ్లు ఎదుర్కొంటూ అహరహం శ్రమిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు.శనివారం బీఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సరిహద్దు భద్రత జాతీయ భద్రతని ఎన్నో సవాళ్ల నడుమ జవాన్ల సేవలు అసామాన్యమైనవని కొనియాడారు. మన పారామిలటరీ బలగాల పట్ల తాను పూర్తి విశ్వాసంతో ఉన్నానని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మనకు స్వతంత్ర రక్షణ విధానం ఉందని మన సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే శక్తులకు అదే భాషలో దీటుగా బదులిస్తామని అమిత్ షా పేర్కొన్నారు.
ప్రపంచ పటంలో భారత్ తన స్ధానాన్ని పటిష్టం చేసుకుంటోందని అన్నారు. అసమాన త్యాగం చేసిన సైనికులకు తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోరాట యోధులను దేశం మరిచిపోదని అన్నారు. మన సరిహద్దులను కాపాడుతున్న పారామిలటరీ బలగాలు, బీఎస్ఎఫ్ దళాలతో ప్రపంచ పటంలో మనకు సముచిత స్ధానం దక్కిందని అన్నారు.