న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆ శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా బుధవారం కలిశారు. ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఆయన కుమారుడు ప్రయాణించిన కారు రైతులపై దూసుకెళ్లినట్లు రైతు సంఘాలు ఆరోపించాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించాలని, ఆయన కుమారుడ్ని అరెస్ట్ చేయాలని రైతులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా బుధవారం ఉదయం ఢిల్లీ నార్త్ బ్లాక్లోని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి జరిగిన ఘటనపై వివరించారు. రైతులపైకి దూసుకెళ్లి ఇద్దరి మరణానికి కారణమైన వాహనంలో తన కుమారుడు లేడని ఇప్పటికే పలు మార్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని అమిత్ షాకు ఆయన చెప్పినట్లు తెలుస్తున్నది.
తన రాజీనామా కోసం ఎలాంటి ఒత్తిడి లేదని అజయ్ మిశ్రా మీడియాతో మంగళవారం అన్నారు. నేనెందుకు రాజీనామా చేయాలి? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఆదివారం లఖింపూర్ ఖేరీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న అజయ్ మిశ్రా కాన్వాయ్లోని వాహనం రైతులపై దూసుకెళ్లిన ఘటనతోపాటు అనంతరం జరిగిన అల్లర్లలో 8 మంది మరణించారు. మృతుల్లో నలుగురు రైతులున్నారు. ఈ ఘటన నేపథ్యంలో లఖింపూర్ ఖేరీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.