చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత పోరును చక్కదిద్దడంపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించిన నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విందు రాజకీయానికి తెర తీశారు. తనపై, తన పాలనపై అసంతృప్తిగా ఉన్న హిందూ నేతలను బుజ్జగించేందుకు గురువారం వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ విందు సమావేశానికి సుమారు 20 మంది నేతలు హాజరయ్యారు. పంజాబ్ రాష్ట్ర అధ్యక్ష పదవి వరించవచ్చని భావిస్తున్న ఎంపీ మనీష్ తివారీ, విద్యాశాఖ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా కూడా ఈ విందు భేటీలో పాల్గొన్నారు. వీరిద్దరు కూడా సీఎం అమరీందర్ సింగ్ అనుచరులే.
మరోవైపు సీఎంపై అమరీందర్ సింగ్పై చాలా కాలంగా మండిపడుతున్న కాంగ్రెస్ అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూ బుధవారం ఢిల్లీలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. కాగా, పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత పోరును చక్కదిద్దేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సిద్ధూకు పార్టీలో కీలక పాత్ర ఇవ్వాలని సూచించింది. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం అమరీందర్ సింగ్ ఆ మేరకు వ్యవహరించాలని, విద్యుత్ బిల్లులు తగ్గించడంతోపాటు ఇసుక, రవాణా మాఫీయాపై చర్యలు చేపట్టాలని కమిటీ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడితోపాటు ఇతర పార్టీ పదవుల్లో మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్న తరుణంలో సీఎం అమరీందర్ సింగ్ విందు దౌత్యానికి తెర తీయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.