న్యూఢిల్లీ: పవిత్రమైన కన్వరీ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం తెలిపింది. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి నవ్నీత్ సెహ్గల్ పేర్కొన్నారు.
కన్వరీ యాత్రను రద్దు చేసే విషయాన్ని పునఃపరిశీలించాలని, దీనిపై సోమవారం లోపు తమకు నివేదించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో యూపీ సర్కార్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకున్నది. మతపరమైన అన్ని సెంటిమెంట్లకంటే ప్రాణాల పరిరక్షణ ముఖ్యం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
కానీ, యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము ఆమోదించబోమని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) ప్రకటించింది. కరోనా వైరస్ పట్ల సున్నితంగా ఆలోచిస్తున్న ప్రజలు.. రాజకీయ పార్టీల ర్యాలీలు, రైతుల నిరసన ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకోవడం లేదని వీహెచ్పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు.
యూపీ సర్కార్ నిర్ణయం హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తుందని, దీన్ని తాము ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కరోనా నేపథ్యంలో సంప్రదింపులు జరిపిన మీదట యూపీ సర్కార్ గతేడాది కూడా కన్వర్ యాత్రను రద్దు చేసింది.