న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం సమీక్షించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, రా కార్యదర్శి సామంత్ గోయల్, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్, బీఎస్ఎఫ్ చీఫ్ పంకజ్ సింగ్తోపాటు భద్రతా సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్లో భద్రతా పరిస్థితులు, అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, సరిహద్దులో సైనిక సంసిద్ధతపై అమిత్ షా వారితో చర్చించినట్లు వెల్లడించాయి.
కాగా, ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్ స్వాధీనం చేసుకున్న తర్వాత నార్త్ బ్లాక్లో ఇటువంటి అత్యున్నత స్థాయి సమావేశం జరుగడం ఇదే తొలిసారి. ఆఫ్ఘన్లో పరిణామాల నేపథ్యంలో దక్షిణ కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా సోపోర్, షోపియాన్, డౌన్టౌన్ శ్రీనగర్ నగరంలో రాడికలైజేషన్ పెరుగుతున్నట్లు కేంద్రానికి నిఘా వర్గాల సమాచారం అందింది. సుమారు 82 మంది కనిపించడం లేదని, వారంతా తమ ఇండ్లను వీడి ఉగ్రవాద సంస్థల్లో చేరినట్లు తెలుస్తున్నది.
మరోవైపు ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో 120 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టగా ఇందులో పది శాతం మంది స్థానికులేనని అధికారులు వెల్లడించారు. జైష్ , లష్కర్, అల్ బద్ర్ ఉగ్రవాద సంస్థలకు చెందిన సుమారు 200 మంది లోకల్స్ కశ్మీర్ లోయలో క్రీయాశీలకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కశ్మీర్ వేర్పాటువాది సయ్యద్ అలీ షా గీలాని మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఆందోళన రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఈ కీలక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.