మున్సిపాలిటీలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ
మున్సిపల్ కమిషనర్ రాజయ్య
మక్తల్ టౌన్, ఏప్రిల్ 24 : కరోనా రోజురోజుకూ విస్తరిస్తుండడంతో స్వచ్ఛందంగా దుకాణా లు బంద్ పాటించాలని మున్సిపల్ కమిషనర్ రాజయ్య అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతుండడంతో మున్సిపాలిటీలో నివారణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అందులో భాగంగా మున్సిపల్లోని 1, 9వ వార్డుల్లో కార్మికులతో సోడియంక్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేయించామన్నారు. అదేవిధంగా 4, 7, 11, 13, 14, 16వ వార్డుల్లో బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేశామన్నారు. మురుగు కాల్వల్లో మురుగు తొలగింపు, స్ప్రే, బ్లీచింగ్ పౌడర్ చల్లించామన్నారు. కరోనా పట్టణంలో విజృంభిస్తున్న కారణంగా దుకాణ సముదాయాలు తమ వంతుగా నివారణ చర్యలో భాగంగా స్వచ్ఛందంగా బంద్ పాటించాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్ ఉపయోగించాలని ఆయన కోరారు.