న్యూయార్క్ : గుండె జబ్బులు, గుండె పోటుతో ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మంచి ఆహారం, నిత్యం వ్యాయామంతో హృద్రోగాల బారినపడకుండా చూసుకోవచ్చని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. తాజాగా పోషకాహారం అధికంగా తీసుకోవడం, మొక్కల నుంచి లభ్యమయ్యే ఆహారం గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురితమైన రెండు పరిశోధనలు వెల్లడించాయి.
యవ్వనంలో ఉండగా మొక్కల నుంచి లభ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా మధ్యవయసులో గుండె జబ్బులను నివారించవచ్చని ఓ పరిశోధన స్పష్టం చేయగా ఈ ఆహారం తీసుకున్న మహిళల్లో మోనోపాజ్ అనంతరం శరీరంలో కొవ్వు తగ్గి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని మరో పరిశోధన వెల్లడించింది. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఈ అధ్యయనాలు స్పష్టం చేశాయి.
పలు రకాల పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, తక్కువ కొవ్వుతో కూడిన డైరీ పదార్ధాలు, స్కిన్లెస్ పౌల్ట్రీ, చేపలు, నట్స్, ఆకుకూరలు తీసుకోవాలని సూచించింది. ఇక సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ఫ్యాట్, సోడియం, రెడ్ మీట్, శీతల పానీయాలు, చక్కెరను పరిమితంగా వాడాలని తాజా పరిశోధన పేర్కొంది.