ఉస్మానియా యూనివర్సిటీ, మే 17: రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ (టీటీయూసీ)లో వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున సోమవారం చేరారు. టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి సమక్షంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. అనంతరం టీటీయూసీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా లక్ష్మిని నియమించారు. ఈ మేరకు ఆమెకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోతె శోభన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్పందించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నాగేశ్వర్రావు, లక్ష్మారెడ్డి, టీటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి నాను నాయక్ పాల్గొన్నారు.