న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్( Amazon )పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది ఆరెస్సెస్ అనుబంధ వీక్లీ మ్యాగజైన్ పాంచజన్య. అదో ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0 అని, తమకు అనుకూలంగా ఉండేందుకు భారత అధికారులకు కోట్ల కొద్దీ లంచాలు ఇచ్చిందని తీవ్ర ఆరోపణలు చేసింది. అక్టోబర్ 3న బయటకు రాబోయే ఈ ఎడిషన్ కవర్ స్టోరీలో అమెజాన్ లక్ష్యంగా విమర్శలు చేసింది. ఇండియాను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి 18వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన పనులే ఇప్పుడు అమెజాన్ చేస్తోందని విమర్శించింది.
ఈ ఆర్టికల్కు టైటిల్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0 అని పెట్టడం గమనార్హం. ఇండియాలో ఏకఛత్రాధిపత్యం కోసం అమెజాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దీనికోసం భారత ప్రజల ఆర్థిక, రాజకీయ, వ్యక్తిగత స్వేచ్ఛను బంధించడం ప్రారంభించిందని పాంచజన్య ఆర్టికల్ విమర్శలు గుప్పించింది. ఇక అమెజాన్కు చెందిన ప్రైమ్ వీడియో కూడా భారత సంస్కృతికి విరుద్ధమైన సినిమాలు, వెబ్సిరీస్ రిలీజ్ చేస్తోందని ఆరోపించింది. తమకు అనుకూలమైన విధానాల కోసం అమెజాన్ ప్రభుత్వ అధికారులకు కోట్లలో లంచాలు ఇచ్చిందని పాంచజన్య వెల్లడించింది.
గత మూడేళ్లలో అమెజాన్ సంస్థ రూ.8500 కోట్ల మేర లీగల్ ఖర్చులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ లీగల్ ప్రతినిధులు కోట్ల లంచాలు చెల్లించారన్న ఆరోపణలపై అమెజాన్ అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తోంది. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్ మంచ్ కూడా అమెజాన్లాంటి ఈ-కామర్స్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది.