దేశానికి స్వాతంత్య్రం లభించి, భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సుమారు ఆరు దశాబ్దాల పాటు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగానూ కేవలం రెండు, మూడు వర్గాల వారికే ప్రాముఖ్యం లభించింది. మిగతా వర్గాల ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పేమీ రాలేదు..
2004లో సుమారు పదిహేనేండ్లు అలుపెరుగని పోరాటం చేసి, తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ సాధించడమే కాక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి కంకణం కట్టుకున్నారు. రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయన్న గంపెడాశతో బడుగు, బలహీనవర్గాలు కేసీఆర్ నాయకత్వంలోని ఉద్యమానికి అండగా నిలిచాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ భాషాసంస్కృతుల పునరుజ్జీవనానికి కేసీఆర్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. స్వాతంత్య్రానంతరం సుదీర్ఘ ప్రయాణంలో తెలంగాణ భాషాసంస్కృతులు విస్మరణకు గురైనప్పటికీ, వాటిని సజీవంగా నిలబెట్టింది నిమ్నకులాల వారే. జానపద గేయాలు, కోలాటం, బతుకమ్మ వంటి ఆటపాటలతోనూ, నృత్యాలతోనూ తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చింది ఈ అణగారిన వర్గాలే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఇంతవరకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని విధంగా, దేశంలో ఏ ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన కూడా చేయని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, కల్లుగీత పనివారికి, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ప్రభుత్వం అందిస్తున్నది. గొల్లకుర్మల అభ్యున్నతికి గొర్రెల పంపిణీ చేపట్టింది.
ఒకప్పుడు రాష్ట్రంలో వైభవోపేతంగా వెలుగొందిన చేనేతరంగం నిరాదరణకు గురి కావడంతో నేత కార్మికులకు ఆకలిచావులు, ఆత్మహత్యలే శరణ్యమైనాయి. ఈ పరిస్థితిని నివారించి, పద్మశాలీల బతుకుల్లో వెలుగు నింపడానికి ఈ రంగానికి రూ. 250 కోట్ల బడ్జెట్ కేటాయించారు. బతుకమ్మ చీరల తయారీ వారికి అప్పగించి చేతినిండా పని కల్పించారు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైబడి ఉన్న వెనుకబడిన తరగతుల సర్వతోముఖాభివృద్ధికి అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో 450 ప్రీ-మెట్రిక్ వసతి గృహాలు, 250 కాలేజీ వసతి గృహాల ద్వారా 70 వేలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. మహాత్మా జ్యోతిభా పూలే వెనుకబడిన గురుకుల విద్యాలయాల్లో వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు. మేదరి, వడ్డెర, విశ్వకర్మ, గౌడ తదితర వృత్తి పనివారికి అవసరమైన ఆర్థిక సహకారం ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన పరికరాలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. కనీసం గుర్తింపునకు కూడా నోచుకోని అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు కేటాయించి, చైర్మన్ను నియమించింది. ధోబీ పనికి, క్షురక వృత్తికి ఉచితంగా విద్యుత్ అందిస్తున్నది. నీలి విప్లవం పథకం కింద మత్స్యకారులందరికీ అవసరమైన సహాయం చేస్తున్నది.
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటుచేసింది. ఈ నిధిలో ఒక ఏడాదికి కేటాయించిన సొమ్ము ఖర్చు కాకుంటే ఆ సొమ్ము మరుసటి సంవత్సరానికి బదలాయింపు జరిగేలా చట్టం చేయటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీల విద్య, ఆర్థికాభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రభుత్వం అమలుచేస్తున్నది. గిరిజనుల రిజర్వేషన్లు 9.08 శాతం నుంచి ఎస్టీల జనాభాకు అనుగుణంగా పెంచడానికి శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి, పార్లమెంట్ ఆమోదానికి పంపింది.
ఒకప్పుడు రాష్ట్రంలో వైభవోపేతంగా వెలుగొందిన చేనేతరంగం నిరాదరణకు గురి కావడంతో నేత కార్మికులకు ఆకలిచావులు, ఆత్మహత్యలే శరణ్యమైనాయి. ఈ పరిస్థితిని నివారించి, పద్మశాలీల బతుకుల్లో వెలుగు నింపడానికి ఈ రంగానికి రూ. 250 కోట్ల బడ్జెట్ కేటాయించారు. బతుకమ్మ చీరల తయారీ వారికి అప్పగించి చేతినిండా పని కల్పించారు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైబడి ఉన్న వెనుకబడిన తరగతుల సర్వతోముఖాభివృద్ధికి అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికంగా ఎదగడానికి బడ్జెట్లో సబ్-ప్లాన్ ద్వారా రూ. 20 వేల కోట్ల నిధులను కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక యువతకు పారిశ్రామికంగా ఎదగడానికి ఈ పథకం వరప్రదాయినిగా మారింది. ఈ ఏడాది ప్రత్యేకించి ఎస్సీల కోసం వెయ్యి కోట్ల నిధులను అదనంగా కేటాయించారు. సుమారు 3 వేల గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా అప్గ్రేడ్ చేసి, వాటికి సర్పంచులుగా గిరిజనులే ఉండేవిధంగా చర్యలు తీసుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంతవరకు నిర్లక్ష్యానికి గురై, గుర్తింపు లేకుండా కొనసాగుతున్న కులాల వారికి ప్రజాప్రతినిధులుగానూ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మన రాష్ట్రం జానపద కళలు, సంస్కృతికీ పుట్టినిల్లు. ఆ కళలను బతికిస్తున్న 550 మంది నిరుపేద జానపద కళాకారులను గుర్తించి, వారికి యూడీసీ స్కేల్తో నెలకు రూ.24,550లను ప్రభుత్వం అందిస్తున్నది.
అణగారినవారే గాక అగ్రవర్ణాలలోని నిరుపేదలను కూడా అనేక రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటున్నది. బ్రాహ్మణ సంక్షేమం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటుచేయడమే కాక వందకోట్ల నిధిని కేటాయించింది. ఆర్యవైశ్య సామాజిక వర్గంలోని నిరుపేదలను ఆదుకోడానికి కూడా ఒక కార్పొరేషన్ను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 11 మున్సిపల్ చైర్మన్ పదవులు, వరంగల్ మేయర్ పదవి, 5 వైస్-చైర్మన్ పదవులు వైశ్యులకు లభించాయి. ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవనానికి స్థలాన్ని కూడా కేటాయించటం ముదావహం. రాష్ట్ర ప్రజలందరి ముఖంలోనూ సంతోషాన్ని చూడాలన్నది కేసీఆర్ ధ్యేయం. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సాకారమైనట్లని మన సీఎం కేసీఆర్ భావన.
(వ్యాసకర్త: చైర్మన్, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్)
కోలేటి దామోదర్