శ్రీనగర్ : కరోనా మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో భక్తి శ్రద్ధలతో యాత్రికులు చేపట్టే అమర్నాధ్ యాత్రను వరుసగా రెండో ఏడాది కూడా అధికారులు రద్దు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సారధ్యంలో సోమవారం జరిగిన అమర్నాధ్ ఆలయ బోర్డు సమావేశంలో ఈ ఏడాది అమర్నాధ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అమర్నాథ్ యాత్రను నిలిపివేసినా ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం అన్ని పూజా క్రతువులు యథావిథిగా పవిత్ర పర్వత గుహల్లో కొలువుతీరిన ఆలయంలో నిర్వహిస్తామని ఆలయ బోర్డు సమావేశానంతరం మనోజ్ సిన్హా పేర్కొన్నారు. ఆలయ బోర్డు సభ్యులతో చర్చించిన మీదట కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది అమర్నాధ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో ఈ ఏడాది అంతమంది ప్రజలు గుమికూడేలా యాత్రను నిర్వహించడం సరైంది కాదని సిన్హా ట్వీట్ చేశారు.