2,500 మందికి ప్రత్యక్ష ఉపాధి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన లాజిస్టిక్స్, డాటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకునేందుకు కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా అదానీ గ్రూప్తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. దీని ద్వారా ప్రత్యక్షంగా 2,500 మందికి, పరోక్షంగా మరికొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది. అయితే ఈ డీల్ విలువ ఎంతో వెల్లడించలేదు. ఈ ఒప్పందం ప్రకారం.. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్) లిమిటెడ్కు అనుబంధంగా పనిచేస్తున్న అదానీ లాజిస్టిక్స్ సంస్థతో కలిసి ఫ్లిప్కార్ట్ తన సరఫరాల చైన్ను మరింత విస్తరించుకోనున్నది. దీనితోపాటు చెన్నైలోని అదానీ కనెక్స్లో తమ మూడవ డాటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఫ్లిప్కార్ట్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ఎడ్జ్ కనెక్స్ల జాయింట్ వెంచరే అదానీ కనెక్స్. ఒప్పందంలో భాగంగా అదానీ లాజిస్టిక్స్ లిమిటెడ్ ముంబైలో ఏర్పాటుకానున్న లాజిస్టిక్స్ హబ్లో 5.34 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో ఫుల్ఫిల్మెంట్ సెంటర్ (వేర్హౌస్)ను నిర్మించి ఫ్లిప్కార్ట్కు లీజుకివ్వనున్నది. పశ్చిమ భారతావనిలోని వేల మంది విక్రేతలు, ఎంఎస్ఎంఈలను మార్కెట్కు అనుసంధానించగలదని భావిస్తున్న ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ 2022 మూడో త్రైమాసికంలో అందుబాటులోకి రావచ్చని అంచనా.