న్యూఢిల్లీ: విమాన ప్రయాణంలో కరోనా నిబంధనలు పాటించని నలుగురిని ఒక సంస్థ నో ఫ్లై జాబితాలో చేర్చింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టింది. ఎయిర్ ఇండియా (ఐఏ) ప్రాంతీయ విభాగమైన అలయన్స్ ఎయిర్కు చెందిన విమానంలో మంగళవారం నలుగురు వ్యక్తులు జమ్ము నుంచి ఢిల్లీకి ప్రయాణించారు. అయితే వారు మాస్కులు ధరించలేదు. విమాన పైలట్ వికాస్ తోమర్, సిబ్బంది ఎంత విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు. దీంతో ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆ నలుగురిని సెక్యూరిటీకి అప్పగించారు. అనంతరం వారిని నో ఫ్లై జాబితాలో చేర్చారు.
ఈ నెల 5న కోల్కతా – ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు మాస్కులు సరిగా ధరించలేదు. అందులో ప్రయాణించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి దీనిని సుమెటోగా తీసుకుని డీజీసీఏ వివరణ కోరారు. ఈ నేపథ్యంలో అన్ని విమానయాన సంస్థలకు డీజీసీఏ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. విమాన ప్రయాణికులు మాస్కులు సరిగా ధరించేలా చూడాలని సూచించింది. మాస్క్ ధరించేందుకు నిరాకరించిన వారిని, కరోనా నిబంధనలు పాటించని వారిని విరుద్ధంగా ప్రవర్తించే ప్రయాణికులుగా పరిగణించాలని పేర్కొంది. అలాంటి వారిని విమానం నుంచి దించివేయవచ్చని లేదా మూడు నెలల వరకు ప్రయాణ నిషేధిత జాబితాలో ఉంచవచ్చని స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.