న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా అమలులోకి తెచ్చిన ఐటీ రూల్స్ అమలు విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్పై ముప్పేట దాడి మొదలైంది.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఫేక్ వీడియో కేసు ఉండగానే, వివాదాస్పద భారత్ చిత్రపటం ఆ సంస్థను వివాదంలోకి నెట్టేసింది.
భారత్ చిత్ర పటాన్ని తప్పుగా చూపినందుకు ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరిపై ఐటీ యాక్ట్లోని 505 సెక్షన్ కింద ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ పోలీసులు కేసు పెట్టారు. ఘజియాబాద్ కేసుతో కలిపితే యూపీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
వివాదాస్పద భారత చిత్రపటంపై మధ్యప్రదేశ్ సైబర్ సెల్ పోలీసులు మరో కేసు పెట్టారు. కేసు నమోదు చేశారు.
మరోవైపు బాలల అశ్లీల సాహిత్యంపై ట్విట్టర్కు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసు సైబర్ సెల్ మరో కేసు రికార్డు చేసింది.
ఈ అంశంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఘజియాబాద్ ఫేక్ వీడియో కేసులో కర్ణాటక హైకోర్టు నుంచి గత వారం మనీశ్ మహేశ్వరి రిలీఫ్ పొందారు. దీన్ని సుప్రీంకోర్టులో యూపీ పోలీసులు సవాల్ చేశారు. ఈ అంశంలో మనీశ్ మహేశ్వరి దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ వేశారు.
ముస్లిం వ్యక్తిపై దాడికి సంబంధించి ఫేక్ వీడియో అప్లోడ్ చేశారని ట్విట్టర్పై అభియోగం. ఈ విషయమై విచారణకు హాజరు కావాలని ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి ఈ నెల 17న సమన్లు జారీ చేశారు. వారంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ముస్లిం వ్రుద్ధుడిపై అసభ్యంగా ప్రవర్తించి దాడి చేశారంటూ వీడియోను ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ఇది వైరల్ అయ్యింది.
మహేశ్వరితోపాటు తొమ్మిది మందిపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనను తప్పుగా చూపి మతం రంగు పులిమారని వీరిపై అభియోగం.
ఘజియాబాద్ ఫేక్ వీడియో కేసులో గతవారం కర్ణాటక హైకోర్టు ఆయనకు రిలీఫ్ ఇచ్చింది. మహేశ్వరిని అరెస్ట్ చేయకుండా స్టే విధించింది.
బెంగళూరులో నివసిస్తున్న మహేశ్వరి.. యూపీకి వెళ్లనవసరం లేదని స్పష్టం చేసింది. అవసరమైతే వర్చువల్గా విచారించొచ్చని తెలిపింది.
కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లడఖ్లను వేరే దేశంగా చూపి ట్విట్టర్ మరో తప్పిదానికి పాల్పడింది.
ట్విట్టర్ మీద చర్య తీసుకోవాలని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా.. డీజీపీ వివేక్ జోహ్రీని ఆదేశించారు. ట్విట్టర్ దేశ ద్రోహ వైఖరి ప్రదర్శిస్తున్నదని మిశ్రా ఆరోపించారు.
గత శుక్రవారం ఒక గంట సేపు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ హ్యాండిల్ను ట్విట్టర్ నిలిపేసింది.
డిజిటల్ మిలీనియం కాపీరైట్స్ యాక్ట్ ఆఫ్ అమెరికాను కేంద్ర మంత్రి ఉల్లంఘించారని ఆరోపించింది.
తర్వాత ఒక హెచ్చరిక జారీ చేసి, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ హ్యాండిల్ను పునరుద్ధరించింది.
సకాలంలో ఐటీ రూల్స్ అమలుకు గ్రీవియెన్స్ అధికారిని నియమించకపోవడంతో ట్విట్టర్కు ఉన్న మధ్యవర్తిత్వ హోదాను కేంద్రం తొలిగించింది.
కేంద్రానికి, ట్విట్టర్కు మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో న్యూ ఐటీ రూల్స్ అమలుకు నియమితులైన తాత్కాలిక గ్రీవియెన్స్ అధికారిగా ధర్మేంద్ర చతూర్ వైదొలిగారు. ఆయన స్థానంలో అమెరికన్ జెరెమీ కెస్సెల్ను నియమించి మరో తప్పిదానికి పాల్పడింది ట్విట్టర్.