న్యూఢిల్లీ : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయేను దీటుగా ఎదుర్కోవడం, థర్డ్ ఫ్రంట్ సన్నాహాలపై చర్చించేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో మంగళవారం సుదీర్ఘంగా సాగిన విపక్షాల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితితో పాటు తదుపరి ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు సాగించారు.
విపక్షాల సమావేశంలో పలు అంశాలు చర్చించామని టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా సమావేశానంతరం వెల్లడించారు. సమస్యల పరిష్కారంలో విఫలమైన విద్వేష సర్కార్కు వ్యతిరేకంగా అన్ని లౌకిక, ప్రజాస్వామ్య రాజకీయ శక్తులకు వేదికగా ఈ సమావేశం సాగిందని సీపీఐ ఎంపీ వినయ్ విశ్వం వ్యాఖ్యానించారు. దేశం మార్పు కోరుతోందని ప్రజలూ ఈ దిశగా ఆలోచిస్తున్నారని అన్నారు. పవార్ చొరవతో జరిగిన ఈ సమావేశంలో టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా, రాష్ట్రీయ లోక్దళ్ చీఫ్ జయంత్ చౌధురి, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ తదితరులు పాల్గొన్నారు.