న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి వ్యక్తిగత వాహనాలను తీసుకువెళ్లినప్పుడు ఇక రీ-రిజిస్ట్రేషన్ అవసరం లేదు. దీని కోసం కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్-సిరీస్)ను కేంద్రం రోడ్డు రవాణా శాఖ ప్రవేశపెట్టింది. బీహెచ్-సిరీస్ కింద వాహనాలను స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే సదుపాయం రక్షణ శాఖ సిబ్బందికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు ఉంటుంది. వీరితో పాటు కనీసం 4 రాష్ర్టాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. ఈ మేరకు ఈ నెల 26న రోడ్డు రవాణా శాఖ నోటిఫికేషన్ను జారీ చేసింది.
ఏంటి ప్రయోజనం?
ఉద్యోగులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి బదిలీ అవుతుంటారు. అలాంటి సందర్భంలో తమ వాహనాలను కొత్తగా వెళ్లిన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించాల్సి వచ్చేది. బీహెచ్ మార్కు ఉన్న వాహనానికి రీ-రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యయప్రయాసలు తొలిగిపోతాయి.
నంబర్ ఎలా ఉంటుంది?
బీహెచ్-సిరీస్ రిజిస్ట్రేషన్ మార్కు ఫార్మాట్ ఇలా ఉంటుంది… ‘ఏఏ బీహెచ్ @@@@ బీబీ’. దీనిలో ‘ఏఏ’ అంటే మొదటిసారి రిజిస్ట్రేషన్ అయిన సంవత్సరం. ‘బీహెచ్’ అంటే భారత్ సిరీస్కు సంక్షిప్త రూపం. ‘@@@@’ ఇది 4 అంకెల సంఖ్య. ‘బీబీ’ స్థానంలో రెండు ఇంగ్లిషు అక్షరాలు వస్తాయి.
వాహన పన్ను ఎంత?
బీహెచ్-సిరీస్ నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలకు పన్ను 3 శ్లాబుల్లో ఉంటుంది. రూ.10 లక్షలలోపు వాహనాలకు 8 శాతం, రూ.10-20 లక్షలలోపు వాహనాలకు 10 శాతం, రూ.20 లక్షలు పైబడిన వాహనాలకు 12 శాతం వసూలు చేస్తారు. డీజిల్ వాహనాలకు పన్ను 2 శాతం అదనం. ఎలక్ట్రిక్ వాహనాలకు 2 శాతం తగ్గుతుంది.
ప్రస్తుతం విధానం ఏమిటి?
ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాన్ని మరో రాష్ట్రంలో గరిష్ఠంగా ఏడాది వరకు వాడుకునేందుకు అనుమతిస్తున్నారు. ఆ గడువు ముగియక ముందే యజమానులు రీ-రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికి మాతృ రాష్ట్రం నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (ఎన్వోసీ) పొందడం తప్పనిసరి.