కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మారుమూల గ్రామమైన అద్మా ప్రజలకు కరోనా టీకా వేసేందుకు అలీపూర్దుర్ జిల్లా కలెక్టర్ సురేంద్ర కుమార్ మీనా శనివారం ఎంతో శ్రమించారు. ఆరోగ్య అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి అడవులు, కొండ ప్రాంతాల మీదుగా 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ట్రెక్కింగ్ చేశారు. కొండలు ఎక్కి దిగి అతి కష్టం మీద అద్మా గ్రామానికి చేరుకున్నారు. 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి టీకా డ్రైవ్ నిర్వహించారు.
అద్మా చాలా మారుమూల గ్రామమని, కరోనా టీకా వేసే ఆరోగ్య కేంద్రం వారికి చాలా దూరంగా ఉందని సురేంద్ర కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలోని 45 ఏండ్లపైబడిన వారికి కరోనా టీకా వేసేందుకు ఆరోగ్యశాఖ బృందంతో కలిసి తాను అక్కడకు వెళ్లానని చెప్పారు. అద్మా గ్రామ ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు కూడా పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు.