Priyanka Tibrewal: పశ్చిమబెంగాల్లో ఉపఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో హడావిడి జోరందుకున్నది. బెంగాల్లోని భవానీపూర్ సహా షంషేర్గంజ్, జాంగీర్పూర్ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నా భవానీపూర్ నియోజకవర్గ ఉపఎన్నికలపైనే రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతున్నది. ఎందుకంటే అక్కడి నుంచి బెంగాల్ సీఎం మమతాబెనర్జి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.
అమెపై ప్రముఖ న్యాయవాది ప్రియాంకా టిబ్రివాల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలుకాగా.. మమతాబెనర్జి ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేశారు. ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రియాంకా టిబ్రివాల్ ఈ మధ్యాహ్నం నామినేషన్ వేశారు. బెంగాల్ ప్రతిపక్ష నేత సువేంధు అధికారి, మరికొందరు ముఖ్యనేతలతో కలిసి వెళ్లి ఆమె రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ ఉపఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరుగనుంది. ఫలితాలు అక్టోబర్ 3న వెల్లడించనున్నారు.