లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 25కు పెరిగింది. గత గురువారమే పలువురు కల్తీమద్యం సేవించగా శుక్రవారం సాయంత్రానికి 15 మంది మృతిచెందారు. 36 మంది ఆస్పత్రి పాలయ్యారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నానికి చికిత్స పొందుతున్న వారిలో మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మృతుల సంఖ్య 22కు చేరింది. ఆదివారం మధ్యాహ్నానికి మరో ముగ్గురు మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 25కు పెరిగింది.
ప్రస్తుతం మరో 26 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. కాగా, అలీగఢ్లోని లోధా, ఖైర్, జవాన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాల్లో గురువారం కల్తీ మద్యం సేవించారు. దాంతో ఆయా గ్రామాల్లో మొత్తం 51 మంది పరిస్థితి విషమించగా అందులో 25 మంది మరణించారు. ఘటనకు సంబంధించి మొత్తం 12 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీ మద్యం రాకెట్ సూత్రధారిని అదుపులోకి తీసుకున్నారు.