న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక మెట్టుపైనే ఉన్నాయి. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) క్రమంగా కీలక వడ్డీరేట్లను కనీస స్థాయికి తగ్గించి వేసింది. ఆర్బీఐ రెపోరేట్ తగ్గించినప్పుడల్లా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ దాదాపు దాన్ని తమ ఖాతాదారులకు బదిలీ చేశాయి. కానీ ప్రైవేట్ బ్యాంకుల తీరు భిన్నంగా ఉన్నది. గత ఏడాది కాలంలో ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా కీలక వడ్డీరేట్లను తగ్గించిన ప్రైవేట్ బ్యాంకులు సగటున మూడో వంతు మాత్రమే ఉండటమే ఆసక్తికర పరిణామం.
కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవస్థలోని నిధులు వెల్లువెత్తేందుకు వీలుగా.. ఆర్బీఐ తన రెపోరేట్ను 115 బేసిక్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ రెపోరేట్కు అనుగుణంగా బ్యాంకుల డిపాజిట్లు/ రుణాల వడ్డీరేట్లు మారుతుంటాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు సగటున రుణాలపై వడ్డీరేట్లను 114 బేసిక్ పాయింట్లు (1.15శాతం) తగ్గించేశాయి. 2020 మార్చిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వివిధ రుణాలపై వడ్డీరేట్లు 8.64 శాతం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 7.5 శాతానికి పడిపోయాయి.
కానీ ప్రైవేట్ రంగ బ్యాంకులు మాత్రం సగటున 38 బేసిక్ పాయింట్లు (0.38%), విదేశీ బ్యాంకులు 63 బేసిక్ పాయింట్లు (0.63%) తగ్గించాయి. ప్రస్తుతం అమలులో ఉన్న సగటు వడ్డీరేట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 70 బేసిక్ పాయింట్లు తగ్గిస్తే, ప్రైవేట్ బ్యాంకులు 68 శాతమే తగ్గించాయి.
గమ్మత్తేమిటంటే ఖాతాదారుల నుంచి డిపాజిట్ల రేట్లను తగ్గించడంలోనూ ప్రైవేట్ బ్యాంకులు తమ లాభాలే ప్రధానంగా వ్యవహరించాయి. ప్రైవేట్ బ్యాంకులు డిపాజిట్లపై 100 బేసిక్ పాయింట్లు (1.0శాతం) వడ్డీరేట్లు తగ్గిస్తే.. ప్రభుత్వ రంగ బ్యాంకులు 82 బేసిక్ పాయింట్ల (0.82%)కు మాత్రమే పరిమితం అయ్యాయి.
దేశంలోని బ్యాంకింగ్ లావాదేవీల్లో ప్రత్యేకించి డిపాజిట్లు, రుణాల్లోనూ నాలుగింట మూడొంతుల వాటా ప్రభుత్వ రంగ బ్యాంకులదే కావడం ఆసక్తికర పరిణామం. కరోనా మొదలైన తర్వాత వివిధ వర్గాల వారికి రుణాలు మంజూరు చేయడంలో ప్రైవేట్, విదేశీ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే ముందున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ వంటి పలు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ.. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారానే అమలయ్యాయి. ప్రైవేట్/ విదేశీ బ్యాంకులతో పోలిస్తే రిటైల్ రుణాలు మంజూరు చేయడంలోనూ, విడుదల చేయడంలోనూ ప్రభుత్వ బ్యాంకులే చురుగ్గా ముందుకు వెళుతున్నాయి.
వ్యవస్థలో ద్రవ్య లభ్యత సాధారణం చేయాలన్న లక్షంతో ముందుకెళుతున్న ఆర్బీఐ మార్గంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తనదైన శైలిలో వడ్డీరేట్లను తగ్గించడానికి పూనుకున్నది. గత (2020-21) ఆర్థిక సంవత్సరంలో ఇంటి రుణాలపై వడ్డీరేటును 6.7 శాతానికి కుదించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎస్బీఐ వడ్డీరేటు (ఇంటి రుణాలు) 6.95 శాతంగా ఉంది. ఎస్బీఐ రుణాల పోర్ట్ఫోలియోలో హోం లోన్లదే పెద్ద వాటా.
రియల్ ఎస్టేట్ రంగానికి పరిపుష్టి కలిగించేందుకు సొంతిండ్లు కొనుగోలు చేసే వారికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీ తగ్గించడం కూడా రుణాల పెరుగుదలకు మరో కారణంగా కనిపిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్