లక్నో: ఉత్తరప్రదేశ్లోని యాదవ్ల ఇలాఖాలో గత పది రోజులలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎప్పుడైతే ఆ పార్టీ మాజీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ వేసుకోవడం, ఆ మరుసటి రోజే పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అందరూ వ్యాక్సిన్లు వేసుకోవాల్సిందిగా పిలుపునివ్వడంతో ఒక్కసారిగా వ్యాక్సినేషన్ పెరిగింది. యాదవ్లకు పట్టున్న ఇటావా, కన్నౌజ్, మెయిన్పురి, ఆజంగఢ్ జిల్లాల్లో మే నెల వరకూ అతి తక్కువ వ్యాక్సినేషన్లు జరిగాయి. మొత్తం యూపీతో పోలిస్తే ఈ జిల్లాల్లో ప్రజలు వ్యాక్సిన్లు వేసుకోవడానికి ఆసక్తి చూపలేదు.
తాను బీజేపీ వ్యాక్సిన్ తీసుకోనని గత జనవరిలో సమాజ్వాదీ అధినేత అఖిలేష్ ప్రకటించిన విషయం తెలుసు కదా. కానీ ఈ నెల 8న ఆయన యూటర్న్ తీసుకున్నారు. బీజేపీ వ్యాక్సిన్ తీసుకోనన్నాను కానీ.. ఇప్పుడు భారత ప్రభుత్వం ఇస్తానంటోంది కాబట్టి ఆ వ్యాక్సిన్ తీసుకుంటానని అఖిలేష్ అన్నారు. ఈ మాటలు యాదవ్ల జిల్లాల్లో సానుకూల స్పందన వచ్చేలా చేశాయి. అప్పటి నుంచి కన్నౌజ్ జిల్లాలో రోజుకు సగటున 5 వేల మంది వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు.
అంతకుముందు మే 30 వరకూ ఇక్కడ రోజువారీ సగటు 200-300 మాత్రమే కావడం గమనార్హం.
ఇప్పుడా జిల్లాలన్నింటిలో వ్యాక్సిన్ల కోసం భారీ క్యూలు కనిపిస్తున్నాయి. మా నేతాజీ (ములాయం)యే వ్యాక్సిన్ తీసుకోవడం చూసినప్పుడు తాము కూడా తీసుకోవాలని నిర్ణయించినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ములాయం, అఖిలేష్ ప్రాతినిధ్యం వహించే మెయిన్పురి, ఆజంగఢ్లలో వ్యాక్సిన్లు వేసుకునే వారి సంఖ్య రెట్టింపైంది.