లక్నో : వచ్చే ఏడాది జరగనున్నయూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ (ఎస్పీ) పార్టీ చిన్న పార్టీలతో పొత్తులతో ముందుకెళుతుందని ఆ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గురువారం వెల్లడించారు. బీజేపీపై అఖిలేష్ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి వాస్తవ అంశాలపై చర్చ జరగడం కాషాయ పార్టీ కోరుకోదని ఆరోపించారు. యూపీ ప్రజలు ప్రస్తుతం మార్పు కోరుతున్నారని అఖిలేష్ పేర్కొన్నారు.
యూపీలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్నికల హామీలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడినా కాషాయ పార్టీకి ఓటమి ఎదురైందని అన్నారు. యూపీ ప్రజలు మార్పు కోరుతున్నారనేందుకు ఇది సంకేతమని చెప్పారు. 2022లో యూపీ ఎన్నికల్లో ప్రజాస్వామిక విప్లవం తలెత్తబోతోందని అఖిలేష్ ట్వీట్ చేశారు. ఇక రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపిస్తామని ఎస్పీ ధీమా వ్యక్తం చేసింది.