లక్నో : వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ఎస్పీ చీఫ్, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. ఎన్నికల బూత్ల్లో అక్రమాలకు తెరలేపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాషాయ పార్టీకి రాజ్యాంగం పట్ల గౌరవం లేదని, ఎన్నికల్లో అక్రమాలతో లబ్ధి పొందాలని చూస్తోందని దుయ్యబట్టారు.
ఇతర రాష్ట్రాల నుంచి ఆరెస్సెస్ కార్యకర్తలను గ్రామాలకు పంపి బూత్ స్ధాయిలో అవకతవకలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. యూపీలో ఎస్పీకి జనాదరణ పెరుగుతుండటంతో బీజేపీ బెంబెలెత్తుతోందని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగే వాతావరణాన్ని భగ్నం చేయాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా బీజేపీ సర్కార్ వ్యవహరిస్తూ నిరంకుశ ధోరణితో ముందకు వెళుతోందని అఖిలేష్ విమర్శించారు.