అలహాబాద్, సెప్టెంబర్ 20: అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి (72) అనుమానాస్పద స్థితిలో మరణించారు. అలహాబాద్లోని బాఘంబరీ మఠంలోని తన నివాసంలో ఉరి వేసుకున్నట్టున్న స్థితిలో ఆయన మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. ఆయన బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను కనుగొన్నారు. తన శిష్యుడైన ఆనంద్ గిరి తనను మానసికంగా వేధించాడని ఆ నోట్లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు, ఆనంద గిరితో పాటు సూసైడ్ నోట్లో పేర్లు ఉన్న వ్యక్తులు ఆద్య తివారీ, అతని కుమారుడు సందీప్ తివారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆనంద్ గిరి ఖండించారు. ‘ఇది ఏడాదికి పైగా జరుగుతున్న కుట్ర. మొదట గురూజీని నా నుంచి దూరం చేశారు. ఇప్పుడు ఆయనను హత్య చేశారు. ఈ కుట్రలో పోలీ సులు, ల్యాండ్ మాఫియా పాత్ర ఉంది’ అని ఆరోపించారు. మఠం భూమి అమ్మకంపై గతంలో తనకు, గురూజీకి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, మేలో అవి పరిష్కారమయ్యాయని చెప్పారు. అఖాడా పరిషత్ దేశంలో అతిపెద్ద సాధువుల సంస్థ. నరేంద్రగిరి మృతిపట్ల ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు.