పట్నా : బిహార్ రాజధాని పట్నా జయప్రకాష్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి ఇద్దరు ఎయిర్లైన్స్ ఉద్యోగులను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగి ప్రిన్స్ రాజ్గా గుర్తించారు. ప్రిన్స్రాజ్ది ఇవాళ జన్మదినం కావడం.. ఇండిగో ఎయిర్ లైన్స్ సేవలు ప్రారంభమై 15 ఏండ్లు నిండటంతో విమానాశ్రయంలో వేడుక జరుపుకునేందుకు తన సహచర లౌరాతో కలిసి బయల్దేరాడు.
విమానాశ్రయం గేట్ 1 వద్ద ఇద్దరు క్యాబ్ దిగి లోపలికి వెళ్తుండగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు చక్రాల పడి ప్రిన్స్రాజ్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. లౌరాకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతివేగంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగి మృతిచెందడంతో ఇండిగో ఎయిర్లైన్స్ వేడుకలను నిలిపివేసింది.