బంజారాహిల్స్, జూలై 13: డీఎస్సీ-2008 ఉపాధ్యాయ నియామకాల్లో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాం లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది కనీసం టైం స్కేల్ ఉద్యోగులుగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి హైదరాబాద్లో వినతిపత్రం అందజేశారు. ఎంపిక ప్రక్రియలో సరైన విధానం పాటించకపోవడంతో ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ తమకు ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అన్యాయంపై 13 ఏండ్లుగా పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పారు. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై మంత్రి సబిత సానుకూలంగా స్పందించారు. మంత్రిని కలిసినవారిలో డీఎస్సీ సాధన సమి తి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్నాయక్, వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, కరుణాకర్, చంద్రశేఖర్, లింగానాయక్ తదితరులు ఉన్నారు.