న్యూఢిల్లీ: దేశీయ వ్యాపారాలపై వాయు కాలుష్యం ప్రతి ఏటా రూ.7,000 కోట్ల (95 బిలియన్ డాలర్లు) భారాన్ని మోపుతున్నది. ఇది భారత జీడీపీలో 3 శాతానికి సమానమని క్లీన్ ఎయిర్ ఫండ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)కి భాగస్వామ్యంగా ఉన్న కన్సల్టింగ్ సంస్థ డాల్బర్గ్ ఎడ్వైజర్స్ నివేదిక పేర్కొంది. గాలి కాలుష్యం వల్ల వ్యాపార సంస్థలకు వాటిల్లే ఖర్చులు ఆరు విధాలుగా ఉంటాయి. కార్మిక ఉత్పాదన, వినియోగదారులను తగ్గించడం, అకాల మరణాలు, ఆరోగ్య ఖర్చులు, సంక్షేమ నష్టాలను పెంచడం, ఆస్తుల ఉత్పాదన తగ్గించడం వంటివి కలుగుతాయని వెల్లడించింది. వీటిలో ముఖ్యంగా ఉద్యోగుల ఉత్పాదకత, వినియోగదారుల క్షీణత, అకాల మరణాల ప్రభావం వ్యాపారాలపై నేరుగా ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది.
డాల్బెర్గ్ అంచనాల ప్రకారం, కార్మికుల ఆరోగ్యంపై వాయు కాలుష్యం ప్రభావం వల్ల ఏటా 1.3 బిలియన్ రోజులను సెలవుగా తీసుకుంటున్నారు. దీని వల్ల వ్యాపార సంస్థలు సుమారు ఆరు బిలియన్ల ఆదాయాన్ని కోల్పోతున్నాయి. అలాగే కార్మికుల మానసిక, శారీరక పనితీరుపై వాయు కాలుష్యం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా వారి ఉద్యోగ ఉత్పాదకతను తగ్గిస్తున్నది. తద్వారా వ్యాపార ఆదాయం సుమారు 24 బిలియన్ల వరకు తగ్గుతున్నదని ఈ నివేదిక అంచనా వేసింది.
మరోవైపు గాలి కాలుష్యం వల్ల వినియోగదారులు తమ ఇండ్ల నుండి బయటకు వచ్చేందుకు ఇష్టపడరు. దీని వల్ల వ్యాపారాలు మందగిస్తాయి. ఫలితంగా 22 బిలియన్ డాలర్ల మేర ఆదాయం తరుగుదలకు ఇది దారితీస్తుందని ఈ నివేదిక పేర్కొంది. 2019 డేటా ఆధారంగా గాలి కాలుష్యం వల్ల కలిగే నష్టాలను అంచనా వేసింది.
కాలుష్యం వల్ల లాభదాయకత తగ్గే నాలుగు మార్గాలపై పరిమాణాత్మక విశ్లేషణ ఆధారంగా ఈ రిపోర్టును తయారు చేశారు. వీటిలో అకాల మరణాలు, వర్తమానవాదం, ఉద్యోగులసెలవులు, వినియోగదారులు తగ్గడం వంటివి ఉన్నాయి. వాయు కాలుష్య డేటా, ట్రాఫిక్ డేటా, ఫార్మసీ అమ్మకాల డేటా, అకాల మరణాల డేటాను ఉపయోగించి ఈ నివేదికను రూపొందించారు.