న్యూఢిల్లీ: తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్లో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి అధికారులు ఎయిర్ స్పేస్ను మూసివేశారు. దాంతో అమెరికా నుంచి భారత్కు వస్తున్న రెండు ఎయిర్ ఇండియా విమానాలను ( Air India flights ) దారిమళ్లించారు. చికాగో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఏఐ-126 విమానాన్ని ఆఫ్ఘన్ గగనతలం మూతపడటంతో గల్ఫ్ ఎయిర్స్పేస్లోకి మళ్లించారు. ఆ విమానం షార్జాలో ల్యాండ్ అయ్యి ఇంధనాన్ని నింపుకోనుంది. అనంతరం భారత్కు బయలుదేరనుంది.
ఇక శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన మరో ఎయిర్ ఇండియా విమానం ఏఐ-174ను కూడా ఆఫ్ఘన్ ఎయిర్స్పేస్కు బదులుగా గల్ఫ్ ఎయిర్ స్పేస్కు మళ్లించారు. మరి కాసేపట్లో ఆ విమానం కూడా షార్జాలో ల్యాండ్ కానుంది. కాగా, తాలిబన్లు ఆదివారం ఆఫ్ఘనిస్థాన్పై పూర్తి పట్టుసాధించారు. రాజధాని కాబూల్ను కూడా హస్తగతం చేసుకోవడంతో దేశం మొత్తం వాళ్ల చేతుల్లోకి వెళ్లినట్లయ్యింది. ఈ క్రమంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.