న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో చిక్కుకున్న భారత రాయబార కార్యాలయ సిబ్బందిని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. అందుకోసం భారత వాయుసేన (ఐఏఎఫ్) ప్రత్యేక విమానం ఏసీ -17ను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయం తాలిబన్ల ఆధీనంలో ఉన్న నేపథ్యంలో ఐఏఎఫ్ విమానాన్ని అక్కడికి పంపేందుకు అమెరికాతో కేంద్ర హోంశాఖ వర్గాలు నిరంతరం సంప్రదిస్తున్నాయని సమాచారం.
ఈ విమానంలో 250 మంది భారతీయులను తరలించగలమని కేంద్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. విమానాశ్రయంతోపాటు యావత్ కాబూల్.. తాలిబన్ల ఆధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. అడుగడుగునా చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు తాలిబన్లు. ఈ నేపథ్యంలో ఎంత మంది విమానాశ్రయానికి చేరుకోగలరన్న దానిపైనే చర్చ జరుగుతున్నది.
ఇంతకుముందు కాబూల్ బయలుదేరి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం.. విమానాశ్రయంలో దిగకుండానే తిరిగి వచ్చింది. రాయబార కార్యాలయ సిబ్బందితోపాటు మొత్తం 400 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఆఫ్ఘన్ దేశీయులు సైతం భారత్కు వచ్చేందుకు దాఖలు చేసిన వీసా అప్లికేషన్లు కేంద్ర హోంశాఖ పరిశీలనలో ఉన్నాయి. మంగళవారం ఆఫ్ఘన్లో భారత రాయబారి రుద్రేండ్ర టాండన్తోపాటు 120 మంది దౌత్య సిబ్బంది స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.